బియ్యంతో పాటు తొమ్మిది రకాల సరుకులు అందించాలి
ABN , First Publish Date - 2021-07-27T04:33:17+05:30 IST
గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే రేషన్కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యవసర సరుకులతో కూడిన సంచి అందించే వారని, ఇప్పుడు కూడా అదే తరహాలో ఆహార భద్రత కార్డు ఉ
ధనిక రాష్ట్రమై ఉండి ఇవ్వలేరా?
ప్రభుత్వానికి సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్న
నాలుగు లక్షల రేషన్ కార్డుల అందజేత చరిత్రాత్మకం : జడ్పీచైర్మన్ కమల్రాజు
మధిరలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న ఇద్దరు నేతలు
మధిరటౌన్, జూలై 26 : గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే రేషన్కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యవసర సరుకులతో కూడిన సంచి అందించే వారని, ఇప్పుడు కూడా అదే తరహాలో ఆహార భద్రత కార్డు ఉన్న వారందరికీ అందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షకు గురవుతోందనే రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. కానీ రాష్ట్రం ఎర్పడినప్పుడు మిగులు బడ్జట్తో ధనిక రాష్ట్రంగా ఉందని, అలాంటి రాష్ట్రంలో నిరుపేదలకు బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, నూనె, పంచదార లాంటివి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. దీనిపై అవసరమైతే ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు. ఆలస్యమైనా రేషన్ కార్డులను ఇప్పటికైనా అందించారని, అర్హులైనా మంజూరు కానివారందరినీ గుర్తించి వారికి కూడా త్వరతిగతిన అందించాలని కోరారు. అంతకు ముందు జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఓకే రోజు సుమారు నాలుగు లక్షల మందికి నూతన రేషన్ కార్డులు అందించడం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయమని, ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మధిర మండలంలో 666 మందితో పాటు నియూజకవర్గంలో 3,106 మంది లబ్ధిదారులకు రేషన్కార్డులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో మధిర ఎంపీపీ లలిత, తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, రైతుబంధు కన్వీనర్ చావా వేణు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.