వాస్తవాలకు తగినట్లు మారుతున్నారు : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2021-12-04T22:53:07+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మారుతున్న

వాస్తవాలకు తగినట్లు మారుతున్నారు : నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మారుతున్న వాస్తవాలకు తగినట్లుగా నిరంతరం సర్దుబాటు చేసుకుంటూ, ముందుకు కదులుతున్న ప్రజలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రశంసించారు. ఈ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం సాయపడుతోందన్నారు. దీనిలో ఎమర్జెన్సీ లిక్విడిటీ గ్యారంటీ క్రెడిట్ స్కీమ్, e-Shram portal ప్రధాన పాత్ర పోషించాయని తెలిపారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన నాయకత్వ సదస్సులో శనివారం ఆమె మాట్లాడారు. 


భారత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని అన్ని సూచికలు చెప్తున్నప్పటికీ, కోవిడ్-19 కొత్త రూపాంతరం ఒమైక్రాన్ ఓ హెచ్చరికను పంపిందన్నారు. ఈ ఏడాది జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నదేనని చెప్పారు. ప్రస్తుత శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఒమైక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ, అంత ఆందోళనకరం కాకపోవచ్చుననే భావం కలుగుతోందని తెలిపారు. అయినప్పటికీ ఈ దశలో అలాంటి మాటపై ఆధారపడకూడదన్నారు. కచ్చితమైన సమాచారం తెలియవలసి ఉందని, అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కోవిడ్ నిబంధనలను పాటించాలని, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని చెప్తున్నారని తెలిపారు. భారతీయులు ప్రదర్శిస్తున్న దృఢ నిశ్చయం, పట్టుదల వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందన్నారు. 


కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబరులో) దేశ జీడీపీ వృద్ధి రేటు  8.4 శాతం ఉంది. ఓ సంవత్సరం క్రితం ఇది 7.4 శాతం ఉండేది. 


Updated Date - 2021-12-04T22:53:07+05:30 IST