NITI Aayog కోసం మరిన్ని డేటా సెట్స్: ఓటీఎస్ఐ
ABN , First Publish Date - 2022-05-17T23:21:33+05:30 IST
నీతి ఆయోగ్కు చెందిన నేషనల్ డేటా, అనలిటిక్స్ ప్లాట్ఫ్లామ్ (NDAP)ని అభివృద్ధి చేసిన ఆబ్జెక్ట్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్కు చెందిన నేషనల్ డేటా, అనలిటిక్స్ ప్లాట్ఫ్లామ్ (NDAP)ని అభివృద్ధి చేసిన ఆబ్జెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (OTSI) కీలక ప్రకటన చేసింది. మరికొన్ని వారాల్లో ఈ ప్లాట్ఫామ్కు మరిన్ని డేటా సెట్స్ను యాడ్ చేయనున్నట్టు తెలిపింది. నీతి ఆయోగ్ ఇన్పుట్స్తో అభివృద్ధి చేసిన ఈ ప్లాట్ఫామ్ను గత వారమే ఆవిష్కరించారు.
పౌరులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, పరిశోధకులు, సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఎలాంటి అవాంతరాలు లేకుండా వివిధ డేటాసెట్లను విలీనం చేయడం ద్వారా అన్ని విభాగాల డేటాను సులభంగా విశ్లేషించేందుకు ఈ పోర్టల్ సాయం చేస్తుంది. ప్రస్తుతం ఇది 47కు పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, అలాగే 14 రంగాలలో 203 డేటాసెట్లను అందిస్తుంది. భవిష్యత్తులో గ్రామస్థాయికి కొత్త డేటా సెట్లను జోడించనుంది. ఈ పోర్టల్పై లభ్యమయ్యే డాటా సెట్స్ను వినియోగ అంశాలు ఆధారంగా నిపుణులతో చర్చించిన తరువాత అందుబాటులోకి తీసుకొచ్చారు. జనాభా లెక్కలు, కుటుంబ ఆరోగ్య సర్వే, ఏకీకృత జిల్లా స్థాయి సమాచార వ్యవస్ధ, విద్యా సమాచారం మొదలైనవి ఈ పోర్టల్పై అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా ఓటీఎస్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్ర తాళ్లూరి మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 30వేలకు పైగా సోర్స్ ఫైల్స్ను పలు శాఖల నుంచి ప్రాసెస్ చేయడంతో పాటు వాటిని ఎన్డీఏపీపై 203 డేటా సెట్లతో మిళితం చేసినట్టు చెప్పారు. మరికొన్ని వారాల్లో మరిన్ని డాటా సెట్లను పొందేందుకు కృషి చేస్తామన్నారు.