యాదాద్రిలో శాస్త్రోక్తంగా నిత్యపూజలు

ABN , First Publish Date - 2021-05-10T06:40:11+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం స్వామికి నిత్యపూజా కైంకర్యాలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి.

యాదాద్రిలో శాస్త్రోక్తంగా నిత్యపూజలు
బాలాలయంలో నిత్యకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, మే 9: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం స్వామికి నిత్యపూజా కైంకర్యాలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. బాలాలయ కవచమూర్తులను అభిషేకించి అర్చించిన పూజారులు స్వామివారి నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు. అనుబంధ రామలింగేశ్వరుడి ఉపాలయంలో నిత్యవిధి పూజలు శైవ సంప్రదాయ రీతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.2,31,456 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే యాదాద్రిక్షేత్రం భక్తుల సందడి లేక వెలవెలబోయింది. ఒక వైపు ఆలయ విస్తరణ పనులు, మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో యాదాద్రికి భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. దీంతో ఆలయం, తిరువీధులు, పరిసర ప్రాంతాలు, సేవా మండపాలు బోసిపోయాయి. భక్తు ల సంచారం లేక ఆలయ దర్శన క్యూలైన్లు నిర్మానుష్యంగా కన్పించాయి.


కరోనా ప్రభావంతో మందకొడిగా విస్తరణ పనులు 

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో యాదాద్రి ఆలయ విస్తరణ పను లు మందకొడిగా కొనసాగుతున్నాయి. విస్తరణ పనులు నిర్వహించే కార్మికులకు వైరస్‌ సోకడంతో చాలామంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. మిగిలిన కార్మికులు సైతం విస్తరణ పనులు నిర్వహించేందుకు జంకుతున్నారు. దీంతో అనుకున్న సమయానికి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యేది కష్టమే. 

Updated Date - 2021-05-10T06:40:11+05:30 IST