భారత రక్షణ నిధికి నిజాం విరాళం
ABN , First Publish Date - 2020-11-29T06:46:57+05:30 IST
ఆస్ఫజాహీల వంశంలో అత్యంత వివాదాస్పద ప్రభువుగా చరిత్రకెక్కిన రాజు మీర్ ఉ స్మాన్ అలీఖాన్.
హైదరాబాద్ సిటీ, నవంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ఆస్ఫజాహీల వంశంలో అత్యంత వివాదాస్పద ప్రభువుగా చరిత్రకెక్కిన రాజు మీర్ ఉ స్మాన్ అలీఖాన్. ఏడో నిజాం ఏలికలోనే రాచరికం తలొగ్గి, ప్రజాస్వామ్యం నిలిచింది. అదే సమయంలో ఏడో నిజాం కొన్ని విద్వేషకర శక్తులను ప్రోత్సహించాడనే విమర్శనూ మూటకట్టుకున్నాడు. అయితే, ‘ఏడో నిజాం వ్యక్తిత్వాన్ని తెలిపేందుకు ఒక ఘటనను ప్రామాణికంగా చూడాలని’ చరిత్ర అధ్యయనకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి చెబుతున్నారు. 1965 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ సమయం లో ఇరు దేశాల మధ్య సమరం తప్పదన్నంత గా పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే నాటి భారత ప్రభుత్వం ఆర్థిక వనరుల లేమితో యుద్ధానికి సన్నద్ధం కాలేని స్థితి. అలాంటి విపత్కర పరిస్థితిలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అప్పటి రాజ కుటుంబీకులందరినీ కలిసి ‘భారత రక్షణ నిధి’కి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా విన్నవించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఐదు వేల కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చి, దేశభక్తిని చాటుకున్నారు. భాగ్యనగరం పరమత సహనానికి ఆలవాలం అనడానికి ఇలాంటి మరెన్నో ఘటనలకు ఈ నేల సాక్ష్యం.