గోదావరితో నిజామాబాద్ సస్యశ్యామలం
ABN , First Publish Date - 2021-04-23T07:51:00+05:30 IST
గోదావరి జలాలను నిజాంసాగర్ ప్రాజెక్టుకు తీసుకురావడం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పచ్చని పంటల సాగుతో సస్యశ్యామలం కానుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ వల్లే మంజీరాలోకి జలాలు: మంత్రి వేముల
నాగిరెడ్డిపేట, ఏప్రిల్ 22: గోదావరి జలాలను నిజాంసాగర్ ప్రాజెక్టుకు తీసుకురావడం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పచ్చని పంటల సాగుతో సస్యశ్యామలం కానుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ శివారు వద్ద మంజీరా నదిలోకి గోదావరి జలాలు వచ్చి చేరడంతో.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ప్రశాంత్రెడ్డి గోదావరి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 6న కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా గోదావరి నీటిని పోచారం ప్రాజెక్టుకు విడుదల చేయగా.. అవి ఇప్పుడు మంజీరా నదిలోకి వచ్చి చేరాయన్నారు.
స్పీకర్ పోచారం కంటతడి
నిజాంసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి విషయంలో గతంలో అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండేదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నీటి విడుదల కోసం తాను పడిన కష్టాలను గుర్తు చేసుకొని ఆయన కంటతడి పెట్టారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, కేసీఆర్ కృషి ఫలితంగా గోదావరి జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తుండడం శుభసూచకమని చెప్పారు.