శ్రీచక్ర సంచారిణీ శరణు శరణు!
ABN , First Publish Date - 2020-10-27T07:25:44+05:30 IST
జిల్లాలో విజయదశమి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గృహాలు, ఆలయాలు, దుకాణాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు...
భక్తిశ్రద్ధలతో విజయదశమి
కళకళలాడిన వ్యాపార సంస్థలు
కనువిందు చేసిన అమ్మవారి అలంకారాలు
ముగిసిన దసరా ఉత్సవాలు
\
నెల్లూరు (సాంస్కృతికం), అక్టోబరు 26 : జిల్లాలో విజయదశమి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గృహాలు, ఆలయాలు, దుకాణాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు... ఇలా అన్నింటిని మంగళ తోరణాలతో అలంకరించి వాహన, ఆయుధ పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేట చెంగాళమ్మ, నెల్లూరు రాజరాజేశ్వరి, జొన్నవాడ కామాక్షితాయి, నర్రవాడ వెంగమాంబ ఆలయాల్లో అమ్మణ్ణి దర్శనానికి, వాహన పూజలకు భక్తులు బారులు తీరారు. పలు ఆలయాల్లో అమ్మవార్లు విశేష అలంకరణల్లో కనువిందు చేశారు. కొనుగోలుదారులతో వస్త్ర, స్వర్ణ, గృహోపకరణ దుకాణాలు కళకళలాడాయి. ఈ దసరాకు ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాల అమ్మకం కూడా జోరుగా సాగింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టి అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ సాయంత్రం ఆలయాల్లో దుర్గామాతను పూజించారు. శమీ పూజలు జరిపారు. విశేష హోమాలు, పూర్ణాహుతులు నిర్వహించారు. దీంతో దసరా ఉత్సవాలు ముగిశాయి.