నగదు కష్టాలు..!

ABN , First Publish Date - 2020-10-30T10:50:20+05:30 IST

ఎడగారులో జిల్లాలో పంట పండించడం ఒక ఎత్తయితే.. పండించిన పంటను అమ్ముకోవడం మరో ఎత్తుగా మారింది.

నగదు కష్టాలు..!

 రైతులకు సకాలంలో అందని ధాన్యం డబ్బులు

 నెలలు గడుస్తున్నా ఎదురుచూపులే..

 చెల్లించాల్సింది రూ. 200 కోట్ల పైనే..!

 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి

  బిల్లులు పంపడంలో తీవ్ర జాప్యం

 అందుకనే ఆలస్యం : సివిల్‌ సప్లయ్స్‌ డీఎం


నెల్లూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎడగారులో జిల్లాలో పంట పండించడం ఒక ఎత్తయితే.. పండించిన పంటను అమ్ముకోవడం మరో ఎత్తుగా మారింది. కరోనా సమయంలో రైతులు పెట్టుబడి పెరిగినా నానా తంటాలు పడి ఎలాగోలా పంటను పండించారు. అయితే ఆ ధాన్యానికి మద్దతు ధర లభించడం గగనమైపోయింది. తేమశాతం ఎక్కువగా ఉండడంతో మిల్లర్లు కూడా అధికంగా తూకం తీసుకున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి. అయితే ఇలా కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లకు అమ్మిన ధాన్యానికైనా సకాలంలో డబ్బులు అందుతున్నాయా..? అంటే అదీ లేదు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మి వారాలు గడిచినా చేతికి డబ్బులు అందలేదు. వారంలోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు చెబుతున్న మాటలు అమలు  కాలేదు. కొంతమంది రైతులకు దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంకా కూడా నగదు అందని సందర్భాలున్నాయి. 


రూ.200 కోట్ల బకాయిలు


ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 11 వేల మంది రైతుల నుంచి మూడు లక్షల టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేశారు. దాదాపు రూ.550 కోట్లపైనే రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రూ.350 కోట్లు మాత్రమే చెల్లించారు. డీఎం అప్రూవ్‌ చేసి చెల్లించాల్సినది రూ.50 కోట్ల వరకు ఉండగా, క్షేత్రస్థాయి నుంచి డీఎంకు అందాల్సిన బిల్లులు సుమారు రూ.150 కోట్లకు పైగానే ఉన్నాయి. అయితే ఇందుకు ప్రధానంగా క్షేత్రస్థాయిలోనే ఆలస్యం జరుగుతున్న ట్లు తెలుస్తోంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన తర్వాత ఆ వివరాలతో పాటు బ్యాంకు వివరాలను పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌కు పంపాల్సి ఉంది.


వీటిని పరిశీలించి డీఎం అప్రూవ్‌ చేస్తే రాష్ట్ర కమిషనరేట్‌ అధికారులు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అయితే కొనుగోలు కేంద్రాల నుంచి రైతుల వివరాలు సకాలంలో డీఎం కార్యాలయానికి చేరడం లేదు. కొన్ని చేరినా అసంపూర్తి వివరాలతో వస్తుండడంతో మళ్లీ తిప్పి పంపుతున్నారు. ఇక డీఎం అప్రూవ్‌ చేసిన తర్వాత కూడా రైతుల ఖాతాల్లో జమ కావడానికి కొంత సమయం పడుతోంది. వీటన్నింటి కారణంగా ధాన్యం విక్రయించి కొన్ని వారాలు గడిచినా రైతులకు నగదు అందడం లేదు. 


 సమాచారం అందించడంలో జాప్యం 


ఈ విషయమై పౌరసరఫరాల శాఖ డీఎం రోజ్‌మాండ్‌ను వివరణ కోరగా తమ దగ్గరకు వచ్చిన రైతుల వివరాలను వెంటనే పరిశీలించి, కమిషనరేట్‌కు పంపుతున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైతుల వివరాలు అందడంలో కొంత జాప్యం జరుగుతోందని ఆమె చెప్పారు. అసంపూర్తిగా ఉన్న రైతుల వివరాలను కూడా వెనక్కు పంపుతున్నామని, అందువల్ల కూడా నగదు జమ కావడం ఆలస్యమవుతున్నట్లు ఆమె తెలిపారు. 

Updated Date - 2020-10-30T10:50:20+05:30 IST