ప్రమాదం కాదు.. బంధువులే చంపారు!
ABN , First Publish Date - 2021-10-17T04:36:05+05:30 IST
దౌల్తాబాద్కు చెందిన సిలివెరి వేణుగోపాల్(22) శుక్రవారం రాత్రి మెదక్ జిల్లా చేగుంట వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు.
చేగుంటలో అనుమానాస్పదంగా యువకుడి మృతి
హత్య చేశారని ఆరోపిస్తూ దౌల్తాబాద్లో బంధువుల ధర్నా
లాఠీచార్జ్ చేసిన పోలీసులు
రాయపోల్, అక్టోబరు 16: దౌల్తాబాద్కు చెందిన సిలివెరి వేణుగోపాల్(22) శుక్రవారం రాత్రి మెదక్ జిల్లా చేగుంట వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. వేణుగోపాల్ను హత్య చేశారని భావిస్తూ శనివారం సాయంత్రం వేణుగోపాల్ మృతదేహంతో దౌల్తాబాద్ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు. సమీప బంధువులే వేణుగోపాల్ను హత్యచేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తొగుట సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను అరెస్టు చేసే వరకు ధర్నాను విరమించేది లేదని బంధువులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురికి గాయాలయ్యాయి.