కొవిషీల్డ్ రెండో డోస్పై స్పష్టత ఏదీ?
ABN , First Publish Date - 2021-05-11T16:40:10+05:30 IST
కొవిషీల్డ్ రెండో డోస్ ఎన్ని రోజులకు ఇస్తారనేది
హైదరాబాద్/కేపీహెచ్బీకాలనీ : కొవిషీల్డ్ రెండో డోస్ ఎన్ని రోజులకు ఇస్తారనేది ప్రభుత్వ వైద్యులకు కూడా తెలియడం లేదు. తొలి డోస్ వేసుకున్న చాలా మంది రెండో డోస్ కోసం ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖానాల వద్ద క్యూలో గంటల తరబడి నిలబడినా నిరాశే ఎదురవుతోంది. మొదటి డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలనేది సర్టిఫికెట్లో ఉంటుంది. కానీ ఇవేమి తమకు తెలియదని బాలానగర్ ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో అయితే 45 రోజుల తరువాతే రెండో డోస్ వేస్తామని పంపించి వేస్తున్నారు. అదే బస్తీ దవాఖానాల్లో అయితే ఆరు వారాలు(42 రోజులు) నిండితేనే రెండో డోస్ వేస్తామని చెబుతున్నారు. 42 రోజులకు ఒక్క రోజు తక్కువ ఉన్నా వేయడం లేదు.
సర్టిఫికెట్లో ఉన్న తేదీలను బట్టి వ్యాక్సిన్ కోసం వచ్చామని బ్రతిమిలాడినా పట్టించుకోవడం లేదని వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి డోస్ వేయించుకున్న వారందరికీ సర్టిఫికెట్ ఇచ్చారు. రెండో డోస్ ఇచ్చేటప్పుడు సర్టిఫికెట్లోని తేదీలను పట్టించుకోకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొవిషీల్డ్ రెండో డోస్ ఆరు వారాలా ? లేక 45 రోజులు నిండాలా ? అన్న దానిపై వైద్యులకు అవగాహన లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై బాలానగర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు చందర్ను ఫోన్లో వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.
కూకట్పల్లిలో 58 కరోనా కేసులు
కూకట్పల్లి ప్రాంతంలో సోమవారం 236 కరోనా పరీక్షలు నిర్వహించగా 58 మందికి పాజిటివ్ వచ్చింది. కూకట్పల్లి పీహెచ్సీ పరిధిలో 79 మందిలో 21, జగద్గిరిగుట్ట(హనుమాన్నగర్)లో 40 మందిలో 10, బాలానగర్లో 52 మందిలో 12, పర్వతనగర్లో 40 మందిలో 11, హస్మత్పేటలో 25 మందిలో నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.
కుత్బుల్లాపూర్లో 44 ..
కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో సోమవారం 225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 44 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కుత్బుల్లాపూర్ యూపీహెచ్సీలో 73 మందిలో 15, గాజులరామారంలో 50 మందిలో 9, సూరారంలో 41 మందిలో 6, దుండిగల్ పీహెచ్సీలో 51 మందిలో 11, కొంపల్లిలో 10 మందిలో ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయా కేంద్రాల వైద్యాధికారులు తెలిపారు.