మా ఆసుపత్రిలో డీజిల్ లేదు: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి సిబ్బంది

ABN , First Publish Date - 2022-04-07T22:17:33+05:30 IST

కరెంటు పోతే ఆన్ చేయడానికి కూడా తమ ఆసుపత్రి జనరేటర్‌లో డీజిల్ లేదని

మా ఆసుపత్రిలో డీజిల్ లేదు: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి సిబ్బంది

జంగారెడ్డిగూడెం: కరెంటు పోతే ఆన్ చేయడానికి కూడా తమ ఆసుపత్రి జనరేటర్‌లో డీజిల్ లేదని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతలు, రోగులు నానా అవస్థలు పడుతున్న ఘటన  ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చేరిన బాలింత బంధువుల వివరాల ప్రకారం  ప్రాంతీయ ఆసుపత్రిలో రోగుల  పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. గత నాలుగు రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో నరకం చూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  నేపథ్యంలో గత రాత్రి కరెంట్ పోయిన సందర్భంలో డ్యూటీ నర్సులను కనీసం బాలింతల వార్డులో అయినా జనరేటర్ వేయాలని కోరామన్నారు. కానీ జనరేటర్‌లో డీజిల్ లేదని చెప్పడంతో తాము అవాక్కయ్యామని వారు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పించామని ఒక పక్క అధికారులు చెబుతున్నతారని, కానీ దానికి విరుద్ధంగా జంగారెడ్డిగూడెం ఆస్పత్రిలో పరిస్థితి ఉన్నదని వారు ఆరోపించారు. కరెంట్ కోతలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు అల్లాడిపోయారని వారు తెలిపారు. మరోపక్క దోమల దాడిని సైతం తట్టుకోలేక పోయామని రోగులు, వారి బంధువులు పేర్కొన్నారు. 


ఈ క్రమంలో ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులను తెదేపా నాయకులు తెలుసుకున్నారు. దీంతో రోగులకు పార్టీ ఆధ్యర్యంలో చేతి పంకాలు, కొవ్వొత్తులు, దోమల నివారణ చక్రాలను పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకురాలు,  15 వార్డు కౌన్సిలర్ అయిన సూర్య విద్యాసంస్థల అధినేత్రి కరుటూరి రమాదేవి బాలింతలను పరామర్శించి పసిపిల్లలను ఊరడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ మెట్ట మండలాలకు చెందిన వందలాది గ్రామాలకు చెందిన పేదలు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్సకోసం నిత్యం వస్తున్నారన్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఆసుపత్రికి జనరేటర్ సదుపాయం ఉన్నా కూడా ఆసుపత్రి పాలకవర్గం దానిలో డీజిల్ నింపలేదన్నారు. అలాగే డీజిల్‌ను  నిల్వ చేయని దుస్థితి నెలకొందన్నారు. ఫలితంగా రోగుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయని వారు ఆరోపించారు. దీనికి ఉదాహరణ గత రెండు రోజులుగా రోగులు పడుతున్న ఇబ్బందులను వారు వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-04-07T22:17:33+05:30 IST