ఈవీఎంలపై పదే పదే వివరణ అక్కర్లేదు : ఈసీ

ABN , First Publish Date - 2020-11-10T20:38:37+05:30 IST

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయని

ఈవీఎంలపై పదే పదే వివరణ అక్కర్లేదు : ఈసీ

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈవీఎంలు అన్ని విధాలుగా సురక్షితమైనవని, తారుమారు చేయడానికి సాధ్యం కానివని మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గతంలోనూ అనేకసార్లు చెప్పామని, పదే పదే వివరణ అవసరం లేదని వివరించింది. 


డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ చంద్రభూషణ్ కుమార్ మాట్లాడుతూ, ఈవీఎంలు పటిష్టమైనవని, తారుమారు చేయడానికి వీలులేనటువంటి కట్టుదిట్టమైన భద్రత కలవని గతంలో అనేకసార్లు చెప్పామన్నారు. ఈవీఎంల సమగ్రత పట్ల సందేహాలు అవసరం లేదన్నారు. దీనిపై మరింత వివరణ అక్కర్లేదన్నారు. 


2015 బిహార్ శాసన సభ ఎన్నికల్లో 38 చోట్ల ఓట్ల లెక్కింపు జరిగిందని, ప్రస్తుతం 55 చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోందని, పూర్తి ఫలితాలు తెలియాలంటే మంగళవారం అర్ధరాత్రి వరకు వేచి చూడవలసి ఉంటుందని తెలిపారు. 


ఇదిలావుండగా, చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుందని అంచనా వేశాయి. కానీ మంగళవారం ఓట్ల లెక్కింపు ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా కనిపిస్తుండటంతో కాంగ్రెస్ ఈవీఎంల సమగ్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది. 


Updated Date - 2020-11-10T20:38:37+05:30 IST