రుణం మంజూరుకు కొర్రీలు
ABN , First Publish Date - 2022-05-24T05:30:00+05:30 IST
రుణం మంజూరుకు కొర్రీలు
- పొదుపు సంఘం రుణానికి ఇన్సూరెన్సు లింకు.. సభ్యుల నిరసన
ధారూరు, మే24: మహిళాపొదుపు సంఘాలకు రుణం మంజూరుకు ఇన్సూరెన్సు చేయాలని బ్యాంకు అధికారులు కొర్రీలు పెట్టటంపై పొదుపు సంఘం మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ధారూరు స్టేట్ బ్యాంకు ఇండియా ముందు సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. తరిగోపుల గ్రామానికి చెందిన తెలంగాణ పొదుపు సంఘ సభ్యులు రుణం కోసం సోమవారం బ్యాంకు వచ్చారు. ఒక్కొక్కరు రూ. 2,250లు ఇన్సూరెన్సు పాలసీ చేస్తే రూ.8లక్షల రుణం మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. పొదుపు సంఘం సభ్యులు ఇన్సూరెన్సు చేయటానికి ఒప్పుకోలేదు. దీంతో బ్యాంకు అధికారులు పొదుపు సంఘానికి సంబంధించి రుణం మంజూరు చేయకుండా రాత్రి 7గంటల వరకు జాప్యం చేశారు. రుణం కోసం రేపు రావాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో మహిళలు అధికారులపై అగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంకు బయట గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈవిషయాన్ని ఐకేపీ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోగా దిగివచ్చిన బ్యాంకు అధికారులు అదే రాత్రి 8.30 గంటలకు పొదుపు సంఘానికి రూ. 4లక్షలు రుణం మంజూరుకు సంబంధించిన పైల్ను పూర్తి చేశారు. మంగళవారం ఐకేపీ ఉన్నతాధికారులు బ్యాంకుకు వచ్చి లోను డబ్బులు ఇప్పించారు.