దేశంలో ఇక ఫోర్త్ వేవ్ లేనట్టేనట.. తేల్చేసిన వైరాలజిస్ట్
ABN , First Publish Date - 2022-03-09T02:52:12+05:30 IST
దేశంలో ఇక కరోనా వేవ్ల భయాలు లేనట్టే. నిన్నమొన్నటి వరకు దేశంలో నాలుగో వేవ్ తప్పదని కొన్ని అధ్యయనాలు
న్యూఢిల్లీ: దేశంలో ఇక కరోనా వేవ్ల భయాలు లేనట్టే. నిన్నమొన్నటి వరకు దేశంలో నాలుగో వేవ్ తప్పదని కొన్ని అధ్యయనాలు హెచ్చరించినప్పటికీ అలాంటిదేమీ లేదని మరికొందరు నిపుణులు కొట్టేశారు. తాజాగా ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ టి.జాకోబ్ జాన్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా మూడో దశ ముగిసిందని, నాలుగో వేవ్ గురించి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. పూర్తిగా భిన్నమైన వేరియంట్ వస్తే తప్ప దేశంలో నాలుగో వేవ్ వచ్చే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. దేశం మరోమారు ఎండమిక్ దశకు చేరుకుందని, కాబట్టి నాలుగో వేవ్ భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
దేశంలో మంగళవారం కొత్తగా 3,993 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కేసుల సంఖ్య 662 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. గతంలో వచ్చిన శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ ఇన్ఫ్ల్యూయెంజా కారణంగానే వచ్చాయని, ప్రతి ఇన్ఫ్లూయెంజా రెండు, మూడు దశల తర్వాత ముగిసిందని డాక్టర్ జాన్ తెలిపారు.
సార్స్కోవ్-2 నుంచి కొత్త ఉత్పరివర్తనాలు వస్తూనే ఉంటాయని, కొన్ని ఉత్పరివర్తనాలు ‘యాంటిజెనిక్ డ్రిఫ్ట్’కు కారణమయ్యే అవకాశం ఉందని అన్నారు. అలాంటి వైరస్లు చిన్నచిన్న వ్యాప్తి కారణమయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్ జాన్ అన్నారు.