భారతీయులు ఉక్రెయిన్ వీడాల్సిన అవసరం లేదు: ఉక్రెయిన్ రాయబారి

ABN , First Publish Date - 2022-02-16T03:41:33+05:30 IST

ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులకు ఎటువంటి ప్రమాదం లేదని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా తెలిపారు.

భారతీయులు ఉక్రెయిన్ వీడాల్సిన అవసరం లేదు: ఉక్రెయిన్ రాయబారి

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులకు ఎటువంటి ప్రమాదం లేదని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ పౌరులు విద్యార్ధులు, ఉక్రెయిన్ వీడే విషయాన్ని పరిశీలించాలంటూ అక్కడి భారత రాయబార కార్యాలయం తాజాగా సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇగోర్ భారతీయులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ప్రతిష్టంభన తొలగించేందుకు చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి.. భారతీయ  విద్యార్థులు ఇప్పటికిప్పుడు దేశాన్ని వీడాల్సిన కారణం ఏదీ లేదని నా అభిప్రాయం. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే సరిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు.’’ అని పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులపై ఉక్రెయిన్ ప్రభుత్వం  భారత్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందని తెలిపారు. రష్యా చర్చల నుంచి వైదొలగనంతవరకూ భయపడాల్సింది ఏమీ ఉండదని, పరిస్థితి మెరుగవుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-02-16T03:41:33+05:30 IST