మాస్కు లేకుండా తిరిగితే రూ.వెయ్యి జరిమానా
ABN , First Publish Date - 2021-05-09T04:15:19+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దామరగిద్ద మండలంలో కలెక్టర్ హరిచందన శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు.
- కొవిడ్ సెకండ్ వే వ్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
నారాయణపేట/ దామరగిద్ద, మే 8 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దామరగిద్ద మండలంలో కలెక్టర్ హరిచందన శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. దామరగిద్ద పీహెచ్సీతో పాటు మద్దెల్ బీడ్ గ్రామాన్ని తనిఖీచేసి ఇంటింటి సర్వేను ఆశా, అంగన్ వాడీ వర్కర్లు ఎలా నిర్వహిస్తున్నారని కలెక్టర్ ఆరా తీశారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఐసోలేషన్లో ఉండాలని, వారికి అందించే ఐసోలేషన్ కిట్లో ఎన్ని రకాల మందులు ఉంటాయని ప్రశ్నించగా సిబ్బంది ఏడు రకాల మందులు ఉంటాయని కలెక్టర్కు తెలిపారు. మాస్కులు లేకుండా ప్రజలు తిరిగితే వెయ్యి జరిమానా విధించాలని కలెక్టర్ పోలీసులకు సూచించారు. భౌతిక దూరం పాటించాలని, గుంపులుగా ఉండ కూడదని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. కలెక్టర్ పది రోజుల క్రితం నారాయణపేట సమీపంలోని వల్లంపల్లి, కొల్లంపల్లి శివారులో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల పరిశీలన కోసం ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి, ఎస్పీ చేతనలతో కలిసి పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా మొదటిసారి కొవిడ్ సెకండ్ వేవ్లో పర్యటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శశికళ, ఈవోపీఆర్డీ రామన్న ఉన్నారు.