మినిమం టైం స్కేల్ ఇవ్వలేం
ABN , First Publish Date - 2022-10-01T09:56:08+05:30 IST
సమగ్రశిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేసే కేజీబీవీ ఉపాధ్యాయులు, క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్లు, సీఆర్పీలకు మినిమం టైమ్ స్కేలు(ఎంటీఎస్) ఇవ్వలేమని
సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై తేల్చేసిన ప్రభుత్వం
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేసే కేజీబీవీ ఉపాధ్యాయులు, క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్లు, సీఆర్పీలకు మినిమం టైమ్ స్కేలు(ఎంటీఎస్) ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చేసింది. ఇంతకాలం వారందరికీ ఎంటీఎస్ అమలుచేస్తామని హామీలు ఇస్తూ, రెండు జీవోలు కూడా జారీచేసిన ప్రభుత్వం ఇప్పుడు కుదరదని స్పష్టంచేసింది. సమగ్ర శిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య పిలుపుమేరకు ఉద్యోగులు శుక్రవారం సమగ్రశిక్ష కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. కార్యాలయం గేటు వద్ద నిరసన వ్యక్తంచేశారు. దీంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్ష ఇన్చార్జ్ ఎస్పీడీ సురే్షకుమార్ వారితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఎంటీఎస్ వర్తిస్తుందని, ప్రాజెక్టు పరిధిలోని ఉద్యోగులకు వర్తించదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా జీతాల పెంపునకు ఇతర ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు. ఎంటీఎస్ ఇవ్వలేనప్పుడు 2020లో జీవో 40, 2022లో జీవో 5 ఎందుకు జారీచేశారని ఉద్యోగులు కమిషనర్ను ప్రశ్నించగా, ఆ జీవోలు ఆర్థిక శాఖ ఇచ్చిందని, ఎంటీఎస్ సాధ్యం కాదని ఆయన తేల్చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25వేల మంది ఇంతకాలం జగన్ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఆందోళనలో సమాఖ్య అధ్యక్షుడు ఎం.బాలకాశి, కార్యదర్శి కాంతారావు, దేవేంద్ర, కె.విజయ్ పాల్గొన్నారు.