భర్త మరో ముగ్గురు భార్యల్ని తేవాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదు : అస్సాం సీఎం
ABN , First Publish Date - 2022-05-01T15:34:59+05:30 IST
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలవ్వాలని ప్రతి ముస్లిం
న్యూఢిల్లీ : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలవ్వాలని ప్రతి ముస్లిం మహిళ కోరుకుంటున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. తన భర్త మరో ముగ్గురు భార్యలను ఇంటికి తీసుకురావాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదన్నారు. యూసీసీ తనకు సంబంధించిన సమస్య కాదని, అది ముస్లిం మహిళలందరి సమస్య అని చెప్పారు. కావాలంటే వారినే అడగండని సలహా ఇచ్చారు.
శర్మ శనివారం (ఏప్రిల్ 30) న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ముస్లిం మహిళలకు న్యాయం చేయాలంటే యూసీసీని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసిన తర్వాత యూసీసీని తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరూ యూసీసీని కోరుకుంటున్నారన్నారు. తన భర్త మరో ముగ్గురు భార్యలను ఇంటికి తీసుకురావాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదన్నారు.
యూసీసీ ముసాయిదాను రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇటీవల ప్రకటించారు. దీంతో యూసీసీపై చర్చ ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ ఇటీవల మాట్లాడుతూ, యూసీసీ గురించి ప్రజలకు వివరించడం కోసం చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అయితే యూసీసీని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా, మైనారిటీలకు వ్యతిరేకంగా ఈ చర్యలను చేపడుతున్నాయని ఆరోపించింది.
యూసీసీ అంటే ఏమిటి?
భారత రాజ్యాంగంలోని అధికరణ 44 పరిధిలోకి యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి) వస్తుంది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత విషయంలో భారత దేశంలోని ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలని యూసీసీ చెప్తుంది. మతం, స్త్రీ, పురుష, సెక్సువల్ ఓరియెంటేషన్ వంటి వ్యత్యాసాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సమానంగా ఒకే చట్టాన్ని అమలు చేయాలని చెప్తుంది. భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించే చట్టాన్ని తేవాలని అధికరణ 44 పిలుపునిస్తోంది.
యూసీసీని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల ప్రచార ప్రణాళికలో కూడా ఈ హామీని ప్రస్తావించింది. యూసీసీ గురించి దాదాపు ఓ శతాబ్దం నుంచి చర్చ జరుగుతోంది.