విలీనం వార్తలను ఔననలేం

ABN , First Publish Date - 2020-10-27T05:50:44+05:30 IST

మార్కెట్లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ల విలీనంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఆ

విలీనం వార్తలను ఔననలేం

కోటక్‌ బ్యాంక్‌ స్పష్టీకరణ

ముంబై: మార్కెట్లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ల విలీనంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఆ వార్తలను ఇటు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అటు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తోసిపుచ్చాయి.  విలీనంపై తాము ఎలాంటి చర్చలు జరపడంలేదని కేఎంబీ ఒక ప్రకటనలో తెలిపింది. కాని  చిన్న కంపెనీలు, సంస్థలు కొనుగోలు చేయాలని తాము ఎప్పుడూ ఆలోచిస్తామని, ఇటీవల సేకరించిన నిధులు కూడా అందుకోసమేనని  కోట క్‌ గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జైమిన్‌ భట్‌ చెప్పారు.


ఏయే కంపెనీలపై గురి పెట్టింది చెప్పడం తమ విధానానికి విరుద్ధమని, అలాగే ఊహాగానాలపై తాము స్పందించబోమని భట్‌ చెప్పారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తాము మార్కెట్‌ నుంచి రూ.7500 కోట్ల నిధులు సమీకరించామని ఆయ న అన్నారు. పూర్తి స్టాక్‌ డీల్‌లో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకును 2014లో  కేఎంబీ విలీనం చేసుకోవడమే ప్రైవేటు బ్యాంకింగ్‌ విభాగంలో జరిగిన చివరి పెద్ద డీల్‌.


కేఎంబీ మార్కెట్‌ విలువ రూ.2.75 లక్షల కోట్లు కాగా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.50 వేల కోట్లు. కేఎంబీకి 23 శాతం సీఏఆర్‌ ఉంది. ఈ విలీనం జరిగితే అది దేశంలోనే ఎనిమిదో పెద్ద బ్యాంకింగ్‌ సంస్థ కావడంతో పాటు రిటైల్‌ విభాగంలో కేఎంబీ మరింత పటిష్ఠం అవుతుందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం కేఎంబీ స్ర్కిప్‌ 2.36 శాతం పెరిగి రూ.1415.75 వద్ద ముగియగా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేరు 1.46 శాతం పెరిగి రూ.616.30 వద్ద ముగిసింది.




లాభం రూ.2947 కోట్లు

కేఎంబీ సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో 22 శాతం వృద్ధితో రూ.2947 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ఆర్జించింది. స్టాండ్‌ అలోన్‌ లాభం 27 శాతం వృద్ధితో రూ.2184 కోట్లు.

ఇదే సమయంలో బ్యాంకు ఆదాయం రూ.7986 కోట్లు కాగా నికర వడ్డీ ఆదాయం రూ.3913 కోట్లని బ్యాంకు జాయింట్‌ ఎండీ దీపక్‌ గుప్తా తెలిపారు. 


Updated Date - 2020-10-27T05:50:44+05:30 IST