పోస్టల్ బ్యాలెట్.. ఎన్నారైలకు కేంద్రం మొండిచేయి

ABN , First Publish Date - 2021-02-28T14:43:29+05:30 IST

రాబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో విదేశాల్లో ఉంటున్న అర్హులైన ఎన్నారైలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విషయమై మరోసారి కేంద్రం మొండిచేయి చూపింది.

పోస్టల్ బ్యాలెట్.. ఎన్నారైలకు కేంద్రం మొండిచేయి

న్యూఢిల్లీ: రాబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో విదేశాల్లో ఉంటున్న అర్హులైన ఎన్నారైలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విషయమై మరోసారి కేంద్రం మొండిచేయి చూపింది. ఎన్నారైలకు ఈ వెసులుబాటు కల్పించే ముందు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆయా వాటాదారులతో భేటీ కావాల్సిందిగా కేంద్రం సూచించింది. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్) ద్వారా ఓవర్సీస్ ఓటర్లు మార్చి, ఏప్రిల్‌లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే విషయమై తలెత్తిన ప్రశ్నకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు.


"ఎన్నారై ఓటర్ల విషయమై ఎలక్షన్ కమిషన్(ఈసీ) నెలన్నర రోజుల క్రితం న్యాయ మంత్రిత్వ శాఖకు ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. న్యాయ మంత్రిత్వ శాఖ దీనిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు సూచించింది. నేను విదేశాంగ కార్యదర్శితో కూడా మాట్లాడాను. వారు సానుకూలంగా స్పందించారు. ఈటీపీబీఎస్‌ను అమలు చేసే ముందు వాటాదారులతో విస్తృత సమావేశం అవసరమని చెప్పారు." అని అరోరా తెలిపారు. ఈ సమావేశం నెలలోపు జరగవచ్చునని ఆయన అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన సమయంలో మీడియాతో మాట్లాడుతూ అరోరా ఈ విషయాన్ని తెలియజేశారు. కనుక ఈసారి కూడా ఎన్నారైలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వీలు లేదు. మరికొంత కాలం వేచి చూడక తప్పదు.    



Updated Date - 2021-02-28T14:43:29+05:30 IST