వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు: స్వామి ప్రసాద్ మౌర్య

ABN , First Publish Date - 2022-01-12T22:48:34+05:30 IST

యూపీలోని యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి వైదొలగడం ద్వారా బీజేపీలో..

వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు: స్వామి ప్రసాద్ మౌర్య

లక్నో: యూపీలోని యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి వైదొలగడం ద్వారా బీజేపీలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యే స్వామి ప్రసాద్ మౌర్య తన నిర్ణయాన్ని బుధవారంనాడు గట్టిగా సమర్ధించుకున్నారు. బీజేపీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీని తాను వద్దనుకున్నానని, మళ్లీ వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. తనకు చిన్న నేతల నుంచి కానీ, పెద్ద నేతల నుంచి కానీ ఎలాంటి ఫోన్లు రాలేదని చెప్పారు. ''అధికారం, హోదాలో ఉన్న బీజేపీ నేతలు చిన్నవాళ్లా, పెద్దవాళ్లా అనేది ప్రశ్న కాదు. విల్లు నుంచి బాణం బయటకు వచ్చింది. ఇప్పుడు వెనక్కి పోదు'' అని ఆయన స్పష్టం చేశారు.


మంత్రివర్గానికి మంగళవారంనాడు రాజీనామా చేసిన మౌర్య ఆ వెంటనే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు పంపారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువతల, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందునే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో మౌర్య పేర్కొన్నారు. మౌర్య రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లో తమ పార్టీలోకి స్వాగతిస్తూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా, జనవరి 14న తాను లాంఛనంగా సమాజ్‌వాదీ పార్టీలోకి చేరుతున్నట్టు ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ మౌర్య చెప్పారు.

Updated Date - 2022-01-12T22:48:34+05:30 IST