మాతో ఎవరికీ ముప్పు ఉండదు : తాలిబన్లు

ABN , First Publish Date - 2021-10-21T01:51:41+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ ఇరుగు, పొరుగు దేశాలకు తాలిబన్లు ఓ హామీ

మాతో ఎవరికీ ముప్పు ఉండదు : తాలిబన్లు

మాస్కో : ఆఫ్ఘనిస్థాన్ ఇరుగు, పొరుగు దేశాలకు తాలిబన్లు ఓ హామీ ఇచ్చారు. 10 దేశాలతో జరిగిన చర్చల్లో ఆ దేశ తాత్కాలిక డిప్యూటీ పీఎం అబ్దుల్ సలాం హనఫి మాట్లాడుతూ, తమది బాధ్యతాయుతమైన ప్రభుత్వమని, తమ వల్ల ఇతర దేశాలకు ముప్పు ఉండబోదని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని కోరారు. 


ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత మొదటి అంతర్జాతీయ స్థాయి చర్చలు మాస్కోలో జరుగుతున్నాయి. ఈ చర్చలకు రష్యా ఆతిథ్యమిస్తోంది. ఈ చర్చల్లో భారత దేశం, చైనా, పాకిస్థాన్ కూడా పాల్గొంటున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక డిప్యూటీ ప్రధాన మంత్రి అబ్దుల్ సలాం హనఫి మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ ఇస్లామిక్ ఎమిరేట్ నేతృత్వంలో ఏర్పాటైన నూతన ఇస్లామిక్ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైనదని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు, ఈ ప్రాంతం, ముఖ్యంగా పొరుగు దేశాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. తమ దేశంలో భద్రతా పరిస్థితులు విశ్వసించదగినవని చెప్పారు. తమ దేశానికి సమీపంలో, దూరంగా ఉన్న దేశాలకు తమ వల్ల ఎటువంటి ముప్పు ఉండబోదని హామీ ఇస్తున్నామన్నారు. 


అబ్దుల్ సలాం హనఫి గత వారం యూరోపియన్ యూనియన్ దేశాలతోనూ, అమెరికాతోనూ చర్చలకు నాయకత్వం వహించారు. ఆఫ్ఘన్‌కు మానవతావాద సాయం క్రింద 1.2 బిలియన్ డాలర్లు ఇస్తామని బ్రెజిల్ హామీ ఇచ్చింది. రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం చేసిన ప్రకటనలో, మానవీయ సంక్షోభాన్ని నిరోధించేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నాలను ఏకీకృతం చేయడమే మాస్కో చర్చల లక్ష్యమని తెలిపింది. 


Updated Date - 2021-10-21T01:51:41+05:30 IST