సూపరింటెండెంట్‌ బాధ్యతలకు నో..!

ABN , First Publish Date - 2021-05-09T05:03:15+05:30 IST

సూపరింటెండెంట్‌ బాధ్యతలకు నో..!

సూపరింటెండెంట్‌ బాధ్యతలకు నో..!

  • ముందుకు రాని సీనియర్‌ వైద్యులు 
  • రెండు నెలలు విధులు కొనసాగించాలని 
  • డాక్టర్‌ మల్లికార్జున్‌కు ఉన్నతాధికారుల ఆదేశాలు 


తాండూరు: తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు సీనియర్‌ వైద్యులు సైతం ముందుకు రావడంలేదు. ఆసుపత్రి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ మల్లికార్జున్‌ పనిభారం, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేస్తూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఆయన విన్నపాన్ని అధికారులు తిరస్కరించారు. ఈనేపథ్యంలో సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ జయప్రసాద్‌కు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తానూ ఈపరిస్థితుల్లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించలేనని వైద్యవిధాన పరిషత్‌కు లిఖితపూర్వకంగా రాసిఇచ్చారు. అదేవిధంగా మర్పల్లి ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ ఆనంద్‌, తాండూరు జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంవో యాదయ్యను బాధ్యతలు తీసుకోవాలని ఉన్నతాధికారులు కోరినా వారు అంగీకరించలేదు. దీంతో  మరో రెండు నెలల పాటు కచ్చితంగా కొనసాగాల్సిందేనని డాక్టర్‌ మల్లిఖార్జున్‌కు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో రెండు నెలల పాటు కొనసాగాల్సిందేనని, అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి సీనియర్‌ వైద్యులను ఇక్కడికి బదిలీ చేయించి వారికి ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెడతామని వైద్యవిధాన పరిషత్‌ అధికారులు డాక్టర్‌ మల్లికార్జున్‌కు తెలిపినట్లు సమాచారం. ఏమైనా ఇబ్బందులుంటే తనకు నేరుగా తెలియజేయాలని మంత్రి సబితారెడ్డి వైద్యులకు కూడా సూచించారు. రెండు నెలల తర్వాత సమస్యలను తానే స్వయంగా పరిష్కరిస్తానని చెప్పారు. అప్పటివరకు మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించాలని,  ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ బాధ్యతల నుంచి తప్పించరాదని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.

Updated Date - 2021-05-09T05:03:15+05:30 IST