ఎవరి ఒత్తిడి లేదు, రాజీనామా నా సొంత నిర్ణయమే: యడియూరప్ప

ABN , First Publish Date - 2021-07-26T20:29:15+05:30 IST

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా తనపై ఎవరి ఒత్తడి లేదని, రాజీనామా..

ఎవరి ఒత్తిడి లేదు, రాజీనామా నా సొంత నిర్ణయమే: యడియూరప్ప

బెంగళూరు: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా తనపై ఎవరి ఒత్తడి లేదని, రాజీనామా నిర్ణయం తన సొంత నిర్ణయమని బీఎస్ యడియూరప్ప తెలిపారు. సీఎం పదవికి రాజీనామా చేసినట్టు సోమవారంనాడు ఆయన ప్రకటించారు. తద్వారా మరొకరు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమవుతుందని అన్నారు. బీజేపీ రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు.


ఎవరి పేరూ సిఫారసు చేయలేదు...

ముఖ్యమంత్రిగా తన వారసుడి విషయంలో ఎవరి పేరును తాను సూచించలేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తనకెలాంటి అసంతృప్తి లేదన్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ తాను, తన మద్దతుదారులు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. అధిష్ఠానం ఎంపిక  చేసిన కొత్త ముఖ్యమంత్రి సారథ్యంలో తామంతా పని చేస్తామని యడియూరప్ప చెప్పారు.


రెండ్రోజుల క్రితమే అనుకున్నా...

రెండ్రోజుల క్రితమే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని యడియూరప్ప చెప్పారు. రెండేళ్ల పాటు కర్ణాటక ప్రజలకు సేవచేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ప్రజలు, తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలని అన్నారు.

Updated Date - 2021-07-26T20:29:15+05:30 IST