గ్రేటర్ ఎన్నికలకు నోడల్ అధికారులు
ABN , First Publish Date - 2020-09-23T10:01:40+05:30 IST
షెడ్యూల్ ప్రకారమే గ్రేటర్ ఎన్నికలు ఉంటాయన్నది స్పష్టమైంది. ప్రస్తుత పాలకమండలి గడువు ముగియక
ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత
సమావేశం ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేసిన కమిషనర్
కొవిడ్ను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో కసరత్తు షురూ
నోటిఫికేషన్కు ముందే పూర్తయ్యేలా చర్యలు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి) : షెడ్యూల్ ప్రకారమే గ్రేటర్ ఎన్నికలు ఉంటాయన్నది స్పష్టమైంది. ప్రస్తుత పాలకమండలి గడువు ముగియక ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీలో అధికారిక కసరత్తు మొదలైంది. ఎన్నికల ఏర్పాట్లు, ఇతర సన్నాహక చర్యల బాధ్యతలు అప్పగిస్తూ పలువురు అదనపు కమిషనర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్, జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ డీఎస్ లోకేష్కుమార్ మంగళవారం వారితో సమావేశమయ్యారు.
ఎవరు ఏ బాధ్యత నిర్వర్తించాలన్నది స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా రూపకల్పన, ప్రింటింగ్, ఓటర్ ఎన్యూమరేషన్, రిటర్నింగ్/అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్ల నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఎన్నికల సామాగ్రి సేకరణ, ఐటీ సంబంధిత ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల ఏర్పాటు, పోలింగ్ సామాగ్రి సరఫరా, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల గుర్తింపు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఫిర్యాదుల సెల్, కాల్సెంటర్, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ సెల్, పెయిడ్ ఆర్టికల్స్ పరిశీలన, ఓటర్ చైతన్య కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఆయా పనులు ఎలా చేయాలి..? ఎవరెవరు ఏం చేయాలన్న దానిపై లోకేష్కుమార్ దిశానిర్దేశం చేశారు.
నోటిఫికేషన్ వచ్చేలోపు...
రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించేలోపే తమకు కేటాయించిన అంశాలపై తగు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని నోడల్ ఆఫీసర్లకు కమిషనర్ సూచించారు. తాము చేయాల్సిన విధులపై ఒక్కో అధికారి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని పనుల పురోగతిని పరిశీలించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులకు అనుగుణంగా పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ, మొత్తం పోలింగ్ ప్రక్రియలో ముందు జాగ్రత్తలు తీసుకోనున్నట్టు లోకేష్కుమార్ తెలిపారు. సమావేశంలో ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్లు బదావత్ సంతోష్, ప్రియాంక ఆల, రాహుల్రాజ్, జయరాజ్ కెనడి, వీ కృష్ణ, శంకరయ్య, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి వీలైతే అదే నెలలో, లేని పక్షంలో జనవరిలో పోలింగ్ పూర్తి చేయాలని భావిస్తోన్నట్టు తెలుస్తోంది.
నోడల్ ఆఫీసర్లు వీరే...
అధికారి బాధ్యత
జి.వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఓటర్ల జాబితా తయారీ, ముద్రణ
ఎస్ పంకజ, అదనపు కమిషనర్ ఎన్నికలు బీసీ ఓటర్ల గణన
రిటర్నింగ్/అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం
జి.వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బ్యాలెట్ పేపర్ ప్రిపరేషన్
పీ సరోజ, జాయింట్ కమిషసర్ అడ్మిన్ పోస్టల్ బ్యాలెట్
ఏ విజయలక్ష్మి, అదనపు కమిషనర్ అడ్మిన్ ఎన్నికల సామాగ్రి సమకూర్చడం
రాహుల్ రాజ్, అదనపు కమిషనర్ శానిటేషన్ ఎన్నికల సిబ్బంది సమీకరణ
జయరాజ్ కెనడీ, అదనపు కమిషనర్ ఐటీ ఐటీ సంబంధిత విషయాలు, వెబ్ కాస్టింగ్
జే. శంకరయ్య, అదనపు కమిషనర్ యుఎస్డీ శిక్షణ
ఎన్. యాదగిరిరావు, అదనపు కమిషనర్, క్రీడలు బ్యాలెట్ బాక్సుల సమీకరణ
విశ్వజిత్ కంపాటి, ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్, కోడ్ అమలు, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర బృందాల ఏర్పాటు
నాగేశ్వర్రావు, సీటీఓ వాహనాల ఏర్పాటు
జియావుద్దీన్, చీఫ్ ఇంజనీర్ డీఆర్సీ కేంద్రాల గుర్తింపు
ఎస్. దేవేందర్రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణాధికారుల వసతుల ఏర్పాట్లు
వీ కృష్ణ, అదనపు కమిషనర్ (యుబీడీ) సూక్ష్మ పరిశీలకుల నియామకం
వై వెంకటేశ్వర్లు, సీపీఆర్ఓ మీడియా సెల్, పెయిట్ ఆర్టికల్స్ పరిశీలన
మహబూబ్ బాష, ఎస్టేట్ ఆఫీసర్ ఫిర్యాదుల సెల్, కాల్ సెంటర్
వెంకటేశ్వర్లు, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఎన్నికల వ్యయ పరిశీలన
ప్రియాంక ఆల, అదనపు కమిషనర్ రెవెన్యూ రిపోర్టులు, రిటర్న్స్
బదావత్ సంతోష్ హెల్త్ కేర్ అండ్ వెల్ఫేర్