పార్లమెంటులో ఆగని రభస

ABN , First Publish Date - 2021-07-27T06:59:22+05:30 IST

పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

పార్లమెంటులో ఆగని రభస

  • పెగాసస్‌, పెట్రో ధరలు, సాగు చట్టాలపై కొనసాగిన ప్రతిపక్షాల నిరసనలు


న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పెగాసస్‌ స్పైవేర్‌, సాగు చట్టాలు, పెట్రోల్‌ ధరల పెరుగుదలపై సోమవారం కూడా నిరసన గళం వినిపించాయి. ఫలితంగా ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసిన సభాపతులు చివరికి మంగళవారానికి వాయిదా వేయక తప్పలేదు. ఉభయ సభల్లోనూ కార్గిల్‌ యుద్ధ వీరులను స్మరించుకోవడంతో పాటు ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చానును అభినందించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దీంతో పెగాస్‌సపై కాంగ్రెస్‌, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆప్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.


ప్రజాప్రాధాన్యం గల అంశాలను ప్రస్తావించేందుకు 90 మంది సభ్యులు నోటీసు ఇచ్చారని, వాటిని తాను స్వీకరించినప్పటికీ గందరగోళం వల్ల వారు మాట్లాడలేకపోయారని వెంకయ్య చెప్పారు. జీరో అవర్‌లో కొవిడ్‌ టీకాల కొరత, కరోనా వల్ల ఉపాధి కోల్పోవడం, పెట్రో, నిత్యావసర వస్తువుల ధరలు వంటి కీలక అంశాలను ప్రస్తావించడానికి అంగీకరించినప్పటికీ ప్రతిపక్షాల నిరసన వల్ల వాటిని చేపట్టలేకపోయామని వాపోయారు. తాము రోజురోజుకూ నిస్సహాయులమైపోతున్నామన్నారు. కనీసం పెగాసస్‌ నిఘా విషయంలో మంత్రి ప్రకటనపై వివరణలు కోరేందుకూ సభ్యులకు అవకాశం లభించలేదని చెప్పారు.


రాజ్యసభ తొలుత 12 గంటలకు వాయిదా పడ్డ తర్వాత డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రశ్నోత్తరాలను నిర్వహించే ప్రయత్నం చేశారు. సభ్యులు నినాదాలను ఆపకపోవడంతో సభను 2 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత గంటగంటకూ, చివరకు మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, సభను సజావుగా జరిపేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులోకి రాలేదని రాజ్యసభాపక్ష నేత పీయూష్‌ గోయల్‌ చెప్పారు.


లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా కూడా గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలను నిర్వహించే ప్రయత్నం చేశారు. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. వారికి స్పీకర్‌ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో తొలుత సభను మఽధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అప్పుడు కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో 3 గంటలకు వాయిదా పడింది. గందరగోళం మఽధ్యే లోక్‌సభలో ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ సవరణ బిల్లు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ బిల్లులను మూజువాణీ ఓటుతో ఆమోదించారు. దివాలా చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. సభను మంగళవారానికి వాయిదా వేశారు.



ఎర్ర పప్పుపై దిగుమతి సుంకం ఎత్తివేత

ఎర్రకందిపప్పుపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పెట్రోలుపై అత్యధిక అమ్మకం పన్ను మధ్యప్రదేశ్‌లో, డీజిల్‌పై రాజస్థాన్‌లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. 2019లో 4.49లక్షలరోడ్డు ప్రమాదాల్లో 1.51 లక్షలమంది మరణించారని పేర్కొంది. 


Updated Date - 2021-07-27T06:59:22+05:30 IST