ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపులో ఉత్తరాది వారికే తొలి ప్రాధాన్యం: తమిళనాడు విద్యార్థుల ఆరోపణ

ABN , First Publish Date - 2022-03-12T02:50:06+05:30 IST

: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపులో అధికారులు ఉత్తరాది వారికే తొలి ప్రాధాన్యం ఇచ్చారంటూ తమిళనాడుకు చెందిన కొందరు మెడికోలు తాజాగా ఆరోపించారు.

ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపులో ఉత్తరాది వారికే తొలి ప్రాధాన్యం: తమిళనాడు విద్యార్థుల ఆరోపణ

విల్లుపురం: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపులో అధికారులు ఉత్తరాది వారికే తొలి ప్రాధాన్యం ఇచ్చారంటూ తమిళనాడుకు చెందిన కొందరు మెడికోలు తాజాగా ఆరోపించారు. ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు తాము ఏకంగా ఐదు రోజుల పాటు వేచి చూడాల్సి రావడం బాధ కలిగించిందంటూ ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తమిళనాడు వాసి హరిహర సుతన్ ఆరోపించారు. ‘‘విదేశాల్లో ఉన్నప్పుడు మేమందరం పరాయి దేశస్తులమే, కానీ.. ఇండియా విషయానికి వచ్చేసరికి ఉత్తరాది, దక్షిణాది అనే చీలిక కనిపిస్తోంది. మేమందరం భారతీయులం కాదా..’’ అని సుతన్ ప్రశ్నించారు. ఇటీవలే సుతన్, అతడి సోదరుడు వెంకట్రామన్.. ఉక్రెయిన్ నుంచి తన సొంత ఊరు తిరుకోవిళూర్‌కు తిరిగొచ్చారు. వారిద్దరూ మికోల్యావ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో మెడిసిన్ అభ్యసిస్తున్నారు.


‘‘ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ రాజధాని నుంచి ఇండియాకు బయలుదేరేందుకు మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. ప్రయాణానికి ఒక రోజు ముందు కీవ్‌కు చేరుకున్నాం. అయితే.. టిక్కెట్లు క్యాన్సిల్ అయినట్టు ఆ రోజు రాత్రి నాకు మెసేజ్ వచ్చింది. దీంతో.. మేము ఎక్కడికీ వెళ్లలేక అక్కడే ఉండిపోయాము. పొరుగు దేశం హంగరీ నుంచి ఇండియాకు బయలుదేరే ఏర్పాట్లు చేసినట్టు.. ఆ తరువాత భారతీయ రాయబార కార్యాలయం నుంచి కబురు అందింది. అనంతరం.. ఓ బస్‌ను బుక్ చేసుకుని మేం మార్చి 1న హంగరీకి చేరుకున్నాము. కానీ.. భారత్‌కు ప్రయాణమయ్యేందుకు మేము మర్చి 6 వరకూ వేచి చూడాల్సి వచ్చింది’’ అని వెంకట్రామన్ వాపోయాడు. ఆ ఐదు రోజుల పాటు తమకు ఎంబసీ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ తరలింపులో మొదట ఉత్తరాది వారికే ప్రాధాన్యం ఇవ్వడం తమను బాధించిందని ఆరోపించాడు. ‘‘మేమందరం భారతీయులమే కానీ.. అధికారుల తీరు నన్ను బాధించింది. మా జీవితాల చుట్టూ అల్లుకుంటున్న ఈ రాజకీయాలు మాకు అస్సలు అర్థం కావటం లేదు. నేను డిప్రెషన్‌లో కూరుకుపోయాను. నేను, నా సోదరుడు ఉక్రెయిన్ నుంచి ప్రాణాలతో బయటపడాలనేదే మా ఆరాటం. మళ్లీ మా తల్లిదండ్రులను చూడాలనేదే మా ఆశ’’ అని వెంకట్రామన్ చెప్పాడు.

Updated Date - 2022-03-12T02:50:06+05:30 IST