ముక్కి..మొలకెత్తి

ABN , First Publish Date - 2022-08-13T05:16:23+05:30 IST

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్‌ జిల్లాలోని రైస్‌ మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలు తడిచి ముక్కిపోయాయి.

ముక్కి..మొలకెత్తి
మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలోని ఓ రైస్‌మిల్లులో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం

ఎందుకూ కొరగాని 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 

మార్గదర్శకాలు వచ్చాకే కొనుగోళ్లపై తుది నిర్ణయం

ఆందోళనలో మిల్లర్లు


మెదక్‌, ఆగస్టు 12: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్‌ జిల్లాలోని రైస్‌ మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలు తడిచి ముక్కిపోయాయి. పలు మిల్లుల్లో మొలకెత్తాయి. 2021-2022 సీజన్‌కు సంబంధించి జిల్లావ్యాప్తంగా సుమారు 50 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం రైస్‌ మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉన్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. ధాన్యాన్ని మరాడించక ముందే యాసంగి ధాన్యం సేకరించడంతో నిల్వలు ఎడతెరిపి లేకుండా పేరుకుపోయాయి. మెదక్‌, వెల్దుర్తి, పాపన్నపేట, తూప్రాన్‌, చేగుంట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, మాసాయిపేట, పెద్దశంకరంపేట రైస్‌మిల్లుల్లో మిల్లర్లు ధాన్యాన్ని ఆరుబయట టార్పాలిన్లు కప్పి నిల్వ చేశారు. ఎన్నడూ లేనంతగా ఈ వర్షాకాలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో  ధాన్యం పలు చోట్ల తడిసి మొలకలొచ్చాయి. మెదక్‌ పట్టణ శివారులోని మంబోజిపల్లి ఎన్‌డీఎ్‌సఎల్‌ గోదాంలో సుమారు 150 లారీల ధాన్యం తడిసి ముక్కిపోయింది. జిల్లాలో 157 రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో తడిసి బూజు పడుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు ధాన్యం విషయంలో ఏం మాట్లాడటం లేదు. 


మార్గదర్శకాలు వచ్చాకే నిర్ణయం 

- శ్రీనివాస్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, మెదక్‌

2021-2022 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లులు, గిడ్డంగుల్లో నిల్వ చేశారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు ధాన్యం పలు చోట్ల మొలకెత్తడం లేదా బూజు పట్టడం ముక్కిపోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాం. 


========================================================================================================================================================================



Updated Date - 2022-08-13T05:16:23+05:30 IST