కరోనా.. ఇక మహమ్మారి కాదు!
ABN , First Publish Date - 2022-01-22T07:52:44+05:30 IST
: కొవిడ్-19 కేసులు ఇకపైన కూడా కొనసాగుతాయిగానీ.. మున్ముందు అది ఎంతమాత్రం మహమ్మారి (పాండెమిక్)గా ఉండబోదని, మన ఆరోగ్య వ్యవస్థలు చికిత్స చేయగలిగే సాధారణ అనారోగ్యంగా...
ఐహెచ్ఎంఈ అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్, జనవరి 21: కొవిడ్-19 కేసులు ఇకపైన కూడా కొనసాగుతాయిగానీ.. మున్ముందు అది ఎంతమాత్రం మహమ్మారి (పాండెమిక్)గా ఉండబోదని, మన ఆరోగ్య వ్యవస్థలు చికిత్స చేయగలిగే సాధారణ అనారోగ్యంగా మారుతుందని ‘ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ)’ అధ్యయనంలో తేలింది. ఐహెచ్ఎంఈ చీఫ్, అమెరికన్ ఫిజీషియన్ క్రిస్టఫర్ ముర్రే పేరిట ఈ అధ్యయన నివేదిక లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైంది. ఒమైక్రాన్ వేవ్ తర్వాత కూడా కొవిడ్ కేసులు వస్తాయిగానీ ప్రభుత్వాలు ఈ కేసుల కోసం ఇప్పుడు తీసుకుంటున్నట్టుగా అసాధారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉండదని ఆయన అందులో స్పష్టం చేశారు.
‘‘టీకాల వల్ల వచ్చిన ఇమ్యూనిటీగానీ.. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీగానీ.. కాలక్రమంలో తగ్గుతుంది. ఫలితంగా కరోనా వ్యాప్తి కొనసాగుతుంటుంది. చలికాలంలో కేసులు పెరుగుతుంటాయి’’ అని వివరించారు. కానీ, వైరస్ ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జనాభాలో ఎక్కువ శాతం మంది వైరస్ బారిన పడడం, కొత్త వేరియంట్లకు సమర్థమైన వ్యాక్సిన్లు, యాంటీవైరల్ మాత్రలు అందుబాటులోకి రావడం, అలాగే సమర్థమైన చికిత్సా విధానాలు ఇప్పటికే తెలిసి ఉండడమే వైరస్ ప్రభావం తగ్గడానికి కారణాలుగా పేర్కొన్నారు.