‘పదవులపై వ్యామోహం లేదు’

ABN , First Publish Date - 2022-05-23T16:53:12+05:30 IST

తనకు పదవులపై వ్యామోహం లేదని, రాష్ట్రంలో ఒక్కసారైనా అధికారం చేపట్టాలనేదే లక్ష్యమని తమిళనాడులోని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ

‘పదవులపై వ్యామోహం లేదు’

-పీఎంకే ఎంపీ అన్బుమణి

పెరంబూర్‌, మే 22: తనకు పదవులపై వ్యామోహం లేదని, రాష్ట్రంలో ఒక్కసారైనా అధికారం చేపట్టాలనేదే లక్ష్యమని తమిళనాడులోని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ డా.అన్బుమణి రాం దాస్‌ తెలిపారు. చెంగల్పట్టు సమీపం తిమ్మావరంలోని కల్యాణమండపంలో శనివారం పీఎంకే జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జీకే మణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డా.అన్బుమణి మాట్లాడుతూ రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళలు అధికంగా ఉన్నారని, కానీ ఓటేందుకు వారు విముఖత చూపుతున్నారని అన్నారు. పీఎంకే స్థాపించి 32 ఏళ్లు గడిచినా ఎన్నికల్లో సరైన విజయాలు సాధించలేకున్నామని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పీఎంకే పాటుపడుతోందని ప్రజల్లో నమ్మకం ఉందని, దానిని ఓట్ల రూపంలో రాబట్టుకోవడంలో నేతలు, కార్యకర్తలు విఫలమవుతున్నారన్నారు. రాష్ట్రంలో తదుపరి ఎన్నికల్లో డీఎంకే గెలిచే అవకాశం లేదని, ఇక అన్నాడీఎంకే కాలం ముగిసిందని అన్నారు. ప్రత్యామ్నాయంగా ప్రజలు పీఎంకే వైపు చూస్తారని, ఈ విషయాన్ని గుర్తించి పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై రాష్ట్రంలో అధికారం చేపట్టేలా శ్రమించాలని అన్బుమణి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-05-23T16:53:12+05:30 IST