పోలవరం కాదు
ABN , First Publish Date - 2022-07-20T07:50:16+05:30 IST
పోలవరం కాదు
నిర్మాణ జాప్యానికి జగన్ సర్కారే కారణం!
పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ
కాంట్రాక్టు సంస్థతో సమన్వయం లేదు
ఖర్చు చేసే సామర్థ్యమూ లేదు
లోపించిన వ్యూహాత్మక ప్రణాళిక
నిర్మాణ నిర్వహణ లోపభూయిష్టం
ఈ ఏడాది ఏప్రిల్లోగా ప్రాజెక్టు
పూర్తికాకపోవడానికి కారణాలివే
తాజా గడువు 2024 జూన్
జలశక్తి సహాయ మంత్రి తుడు వెల్లడి
టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు జవాబు
న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ తీరే పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర సర్కారుకు ఖర్చు చేసే సామర్థ్యం తక్కువగా ఉండడం, నిర్మాణ, కాంట్రాక్టు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వ్యూహాత్మక ప్రణాళిక లేమి, ప్రాజెక్టు నిర్మాణ సంస్థతో సమన్వయం లేకపోవడంతో పాటు కరోనా మహమ్మారి కారణంగానూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పాటు చేసిన కమిటీ తేల్చినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రాజెక్టు పూర్తి కావలసి ఉండగా.. గడువులోగా అది జరగలేదని తెలిపారు. ‘ఏప్రిల్ తర్వాత కూడా పనులు జరుగుతున్నాయని రాష్ట్రప్రభుత్వం సమాచారం ఇవ్వడంతో.. పనుల ప్రస్తుత స్థితి, జాప్యానికిగల వాస్తవ కారణాలను అధ్యయనం చేసి విశ్లేషించి ప్రాజెక్టు పూర్తయ్యే షెడ్యూల్ను సవరించడానికి నిరుడు నవంబరులో ఓ కమిటీని పీపీఏ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ ఏడాది ఏప్రిల్లో నివేదిక ఇచ్చింది. 2024 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలని సవరణ లక్ష్యాన్ని సూచించింది’ అని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, పర్యవేక్షణకు అనేక చర్యలు తీసుకున్నామని, పనుల పురోగతిని, సమస్యల పరిష్కారానికి పీపీఏ ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా డిజైన్ల విషయంలో నిపుణుల సలహాల కోసం డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ)ని ఏర్పాటు చేశామని, ప్రాజెక్టు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటి వరకు పీపీఏ 14 సార్లు, డీడీఆర్పీ 20 సార్లు, నిపుణుల కమిటీ 7 సార్లు సమావేశమైనట్లు తెలిపారు. ప్రస్తుతం హెడ్ వర్క్స్ పనులు 77 శాతం, కుడి ప్రధాన కాలువ పనులు 93 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 72 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.