మరికాసేపట్లో చంద్రబాబుకు నోటీసులు

ABN , First Publish Date - 2021-05-09T16:37:13+05:30 IST

మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలు జిల్లాలో నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో..

మరికాసేపట్లో చంద్రబాబుకు నోటీసులు

అమరావతి: మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలు జిల్లాలో నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. జగన్ సర్కర్ వైఖరిపై టీడీపీ శ్రేణుల నుంచి విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నారా లోకేష్ ట్వీట్లతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు చంద్రబాబుకు నోటీసు ఇచ్చి వారం రోజుల లోపు హాజరు కావాలని పోలీసులు కోరుతున్నారు. 


ఎన్-440కే వైరస్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. ఆదివారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి ఏడు రోజులలోపు హాజరు కావాలని కోరతామన్నారు. దీనిపై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. చంద్రబాబు నాయుడుకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ తెలిపారు. కర్నూలు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో చంద్రబాబుపై నమోదైన కేసుపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.


కొత్త రకం కరోనా కర్నూలులోనే పుట్టిందని సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. బి.1.136 రకం కరోనాను సీసీఎంబీ గత ఏడాది జూన్‌లోనే గుర్తించిందన్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైర్‌సపై క్లారిటీ ఇచ్చిందని అన్నారు. ఎన్‌ 440 కే స్టెయిన్‌కు సంబంధించిన కేసులు తక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ఈ రకం ప్రయోగశాలల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, బయటి వాతావరణంలో అంతగా వ్యాప్తి చెందదని శాస్త్రవేత్తలు నిర్ధారించారన్నారు. దీని వల్ల ప్రజలు, చిన్నారులు, యువత చనిపోతున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రకం స్టెయిన్‌ కర్నూలులో ఎక్కువగా ఉన్నట్లు చంద్రబాబు భయాందోళనలకు గురి చేశారని సీనియర్‌ న్యాయవాది సుబ్బయ్య వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు విపత్తు నిర్వహణ చట్టం కింద 2005 కింద కేసు నమోదు చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చేందుకు వన్‌టౌన్‌ సీఐ ఆదివారం హైదరాబాదుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. దీనిని నాన్‌ బెయిలబుల్‌ కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-05-09T16:37:13+05:30 IST