India-Britain MoU: భారత్‌లో డిగ్రీ పట్టాతో బ్రిటన్‌లో ఉద్యోగం..!

ABN , First Publish Date - 2022-07-24T21:08:38+05:30 IST

భారతీయ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం బ్రిటన్‌తో ఇటీవల అవగాహన ఒప్పందం(MoU) కుదుర్చుకుంది.

India-Britain MoU: భారత్‌లో డిగ్రీ పట్టాతో బ్రిటన్‌లో ఉద్యోగం..!

ఎన్నారై డెస్క్: భారతీయ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం బ్రిటన్‌తో ఇటీవల అవగాహన ఒప్పందం(MoU) కుదుర్చుకుంది. దీని ప్రకారం.. బ్రిటన్‌(Britain), భారత్‌లోని(India) యూనివర్శిటీలు ఇచ్చే డిగ్రీ, పీజీ పట్టాలను పరస్పరం గుర్తించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం భారతీయ యువతకు ఎంతో లాభించనుంది. భారత యూనివర్శిటీలు ఇచ్చే పట్టాలతో భారతీయులు బ్రిటన్‌లోనూ ఉద్యోగం చేసేందుకు అనుమతి లభించింది. అంతేకాకుండా.. భారత డిగ్రీ, పీజీ పట్టాలసాయంతో భారత యువత బ్రిటన్‌లో పైచదువుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ‘‘ బ్రిటన్, భారత్ దేశాల్లో ఇచ్చే డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లను పరస్పరం గుర్తించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే.. మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ లాంటి చదువులు మాత్రం ఈ ఒప్పందం పరిధిలోకి రావు’’ అని కామర్స్ సెక్రెటరీ బీవీఆర్ సుబ్రమణ్యం జూలై 21న మీడియా సమావేశంలో తెలిపారు. 


నౌకాయాన విద్య, హెల్త్‌కేర్ రంగానికి సంబంధించి ఇరు దేశాలు మరో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. బ్రిటన్, భారత్‌లో నౌకాయాన విద్యకు సంబంధించి డిగ్రీ పట్టాలను గుర్తించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఇక భారత హెల్త్‌‌కేర్ రంగంలోని సిబ్బందికి బ్రిటన్ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. నర్సుల కొరతను ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు భవిష్యత్తులో ఈ ఒప్పందం ఉపయోగకరంగా మారనుంది. గత ఏడాది బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రధాని మోదీ మధ్య కుదిరిన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు ఈ ఎమ్‌ఓయూలు కుదుర్చుకున్నాయి. 

Updated Date - 2022-07-24T21:08:38+05:30 IST