ఇక పల్లెలకు అమృత్ సరోవరం
ABN , First Publish Date - 2022-05-27T06:11:30+05:30 IST
పల్లెల్లో చెరువుల పునరుద్దరణకు కేంద్రం అమృత్ సరోవర్ పథకా న్ని చేపట్టింది.
దెబ్బతిన్న చెరువులకు కొత్త పథకం
జిల్లాలో 65 గ్రామాలు ఎంపిక
ఉపాధి హామీ కింద పనులు
ఏలూరు రూరల్, మే 26 : పల్లెల్లో చెరువుల పునరుద్దరణకు కేంద్రం అమృత్ సరోవర్ పథకా న్ని చేపట్టింది. దీని కింద దెబ్బతిన్న, తక్షణమే పునరుద్దరించాల్సిన ఏలూరు జిల్లాలోని 65 చెరువులను గుర్తించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపించారు. ఎన్ఆర్ఈ జీఎస్ నిధులతో వీటిల్లో పూడిక తీత, కట్టల బలోపేతం, తూముల మరమ్మతు వంటి పనులు చేస్తారు. అవకాశం ఉన్నచోట కొత్త చెరువులను నిర్మిస్తారు. భూగర్భ జలాలు పెంచడం ద్వారా తాగు, సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో చెరువులను అభివృద్ధికి కేంద్రం అమృత్ సరో వర్ను తెచ్చింది. దీనిలో భాగంగా ప్రతి చెరువుకు రూ.లక్ష నుంచి గరిష్టంగా 40 లక్షలు ఖర్చు చేయనున్నారు. అవసరమైతే 15వ ఆర్ధిక సంఘం నిధులు కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఎకరం పైబడి ఉన్న చెరువులను ఎంపిక చేయాలని కేంద్రం తెలిపింది. ఈ పను ల్లో ఎటువంటి యంత్రాలు వాడకుండా కేవలం ఉపాధి హామీ కూలీల ద్వారానే పనులు చేపడ తారు. ప్రతి చెరువు కింద లక్ష పనిదినాలు కల్పిం చాలని లక్ష్యంగా నిర్ణయించారు. పనుల్లో భాగం గా చెరువు అడుగున పది వేల ఘనపుటడుగుల మేర నీటి నిల్వ ఉండేలా కొలతలు ఇచ్చి ఆ మేరకు ఒండ్రు మట్టిని తీస్తారు. ఆ మట్టిని పొలాలకు ఉపయోగించనున్నారు. పనులు పూర్తయితే వచ్చే వానాకాలం చెరువులు జలకళలను సంతరించుకుంటాయి. ఎంపిక చేసిన 65 చెరువుల్లో పనులు పూర్తిచేసి పటిష్టం చేశాకా చెరువు కట్టపై ఆగస్టు 15న జాతీయజెండా ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
గ్రామాలకు వరం
చెరువుల వ్యవస్థను బలోపేతం చేయడానికి వాటికి మరమ్మత్తులు చేయాలని రైతులను ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈలోగా కేంద్రం దేశ వ్యాప్తంగా చెరువుల పునరుద్దరణకు అమృత సరోవర్ పథకాన్ని తీసుకు వచ్చింది. ఏలూరు రూరల్ మండలంలో ఏడు గ్రామాల్లోని చెరువులను అభివృద్ధి చేసేందుకు నివేదికలు సిద్ధం చేసి పంపారు. ఆగస్టు 15వ తేదీలోగా ఈ ప్రాజెక్టు వంద శాతం అమలయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో అధికారులు చెరువులను గుర్తించి పనులు ప్రారంభించనున్నారు.