ఉపాధి కూలీలను కులం పేరుతో విభజించడం సరికాదు
ABN , First Publish Date - 2021-06-22T04:31:56+05:30 IST
ఉపాధి హామీ పథకంలో కూలీలను కులాల పేరుతో విభజించి వేతనాలు వేయడం అన్యాయం చేయడమేనని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి ఎం.జీవరత్నం అన్నారు.
జంగారెడ్డిగూడెం, జూన్ 21 : ఉపాధి హామీ పథకంలో కూలీలను కులాల పేరుతో విభజించి వేతనాలు వేయడం అన్యాయం చేయడమేనని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి ఎం.జీవరత్నం అన్నారు. ఉపాధిహామీ పధకంలో కులాల వారీగా వేతనాలు చెల్లింపును రద్దు చేయాలని ఆంఽధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం, సచివాలయాల వద్ద, పని ప్రదేశాల్లో సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవరత్నం మాట్లాడుతూ కూలీలకు 200 రోజులు పని దినాలు పెంచి రూ.600 వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధి హమీ పథకంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్; రాయల దుర్గారావు, పఠాన్ మస్తాన్, కాకుల సుబ్బారావు, లక్ష్మీనారాయణ, కోనేరురావు, సూర్యచంద్రం పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: ఉపాధి కూలీల మధ్య కుల విభజన తీసుకురావడం సిగ్గు చేటని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీ ఎస్), ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ గిరిజన సంఘం నాయకులు అందుగుల ఫ్రాన్సిస్, ఎ.రవి, తెల్లం రామకృష్ణ అన్నారు. మండలంలో వివిధ ప్రాంతాల్లో ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాలను సోమవారం నాయ కులు సందర్శించి కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతాలు, ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కుల విభజన చేస్తూ తీసుకువచ్చిన మోమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూలీలందరకు వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సిన్ తర్వాత 5 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలన్నారు. ఆరు వారాల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరపాటి రవీంద్ర, బి.డేవిడ్ రాజు, జి.ఏలియా, బి.జయరాజు, బేబి, ఇందిరా, కారం భాస్కర్, తామా ముత్యాలమ్మ, మొడియం నాగమణి, ఉడతా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.