పెళ్లైన 20రోజులకే భార్యపై కట్నం కోసం NRI వేధింపులు.. ఇవ్వకపోవడంతో ఆమెను ఒంటరిగా వదిలేసి Dubai కి జంప్!
ABN , First Publish Date - 2022-05-11T16:03:30+05:30 IST
పెళ్లై 20 రోజుల కూడా గడవకముందే భార్యను ఎన్నారై భర్త తనకు ఇవ్వాల్సిన కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేశాడు.
అహ్మదాబాద్: పెళ్లై 20 రోజుల కూడా గడవకముందే భార్యను ఎన్నారై భర్త తనకు ఇవ్వాల్సిన కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఆ సమయానికి ఆమె ఇవ్వకపోవడంతో భార్యను ఇక్కడే ఒంటరిగా వదిలేసి దుబాయ్కి చెక్కేశాడు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పరిధిలోని వెజల్పూర్కు చెందిన 23 ఏళ్ల యువతికి గతేడాది ఆగస్టులో అదే ప్రాంతానికి చెందిన దుబాయ్లో పనిచేసే ఓ వ్యక్తితో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆమె తల్లితండ్రులు వరుడికి రూ.5లక్షలు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. కానీ, పెళ్లిరోజు కేవలం రూ.3లక్షలు మాత్రమే సర్దుబాటు చేశారు. మిగిలిన రూ.2లక్షలు త్వరలోనే ఇస్తామని కూతురిని అత్తారింటికి పంపించారు.
ఇక కొత్తగా పెళ్లై అత్తారింటికి వెళ్లిన యువతికి 20 రోజుల తర్వాత నుంచి భర్త తనకు రావాల్సిన కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. మిగిలిన రూ.2లక్షలు తేస్తేనే తనతో పాటు దుబాయ్కి తీసుకెళ్తానని, లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్లిపోతానని బెదిరించాడు. కట్నం గొడవ జరుగుతుండగానే భర్త థాయ్లాండ్కు చెందిన సెక్స్ వర్కర్లతో చాటింగ్ చేయడం భార్య కంటబడింది. ఆ విషయమై నిలదీయడంతో భార్యను తీవ్రంగా కొట్టాడు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత భార్యకు తెలియకుండా ఆమెను ఇక్కడే ఒంటరిగా వదిలేసి దుబాయ్కి వెళ్లిపోయాడు. దాంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై గృహింస కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.