రాత్రిపూట ఆస్పత్రి ముందు మృతదేహాన్ని పడేశారు.. స్వదేశంలోకి అడుగు పెట్టిన వెంటనే NRI ని కిడ్నాప్ చేసి మరీ..

ABN , First Publish Date - 2022-06-29T01:46:35+05:30 IST

కేరళకు చెందిన ఎన్నారై ఒకరు దుబాయ్‌ నుంచి భారత్‌కు తిరిగిరాగానే హత్యకు గురయ్యారు.

రాత్రిపూట ఆస్పత్రి ముందు మృతదేహాన్ని పడేశారు.. స్వదేశంలోకి అడుగు పెట్టిన వెంటనే NRI ని కిడ్నాప్ చేసి మరీ..

కాసరగోడ్: కేరళకు చెందిన ఎన్నారై ఒకరు దుబాయ్‌ నుంచి భారత్‌కు తిరిగిరాగానే హత్యకు గురయ్యారు. ఓ గ్యాంగ్ ఆయనను కిడ్నాప్ చేసి మరీ అంతమొందించింది. గ్యాంగ్ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఆస్పత్రి ముందు పడేసి వెళ్లిపోయారు. కాసరగోడ్ జిల్లాలోని ఉప్పల టౌన్‌లో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అనుమానితుల్ని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..  తన సోదరుడు అన్వర్, బంధువు అన్సార్ కిడ్నాప్ అయినట్టు తెలియడంతో సిద్దీఖీ దుబాయ్ నుంచి వారం క్రితం హుటాహుటిన ఇండియాకు తిరిగొచ్చారు. ఆ తరువాత గ్యాంగ్ సభ్యులు ఆయనను కిడ్నాప్ చేశారు. అనంతరం..  ఆయన సోదరుడు, బంధువును విడిచిపెట్టారు. ఆ తరువాత సిద్దీఖీని హత్య చేసి ఆయన మృతదేహాన్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రి ముందు పడేసి కారులో పారిపోయారు. 


ఆస్పత్రి సీసీకెమెరాల్లో ఇదంతా రికార్డైంది. అయితే.. అంతకుఅరగంట మునుపే సిద్దీఖీని అంతమొందించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆయన కాలిమడమలు కమిలిపోయి ఉన్నాయని చెప్పారు. ఇది మినహా ఆయన శరీరంపై గాయాలకు సంబంధించి ఎటువంటి గుర్తులు లేవు. మరోవైపు..  సిద్దీఖీపై తీవ్రంగా దాడి జరగడంతోనే ఆయనకు గుండె పోటు వచ్చి మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక.. సిద్దీఖీ సోదరుడు, బంధువుని కూడా గ్యాంగ్ సభ్యులు చిత్ర హింసలు పెట్టారు. వారు ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక వివాదాల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ముమ్మర దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-29T01:46:35+05:30 IST