రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నారై మన్నవ మోహన కృష్ణ

ABN , First Publish Date - 2021-10-17T15:50:58+05:30 IST

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా మన్నవ మోహనకృష్ణను నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నారై మన్నవ మోహన కృష్ణ

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా మన్నవ మోహనకృష్ణను నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు కళాశాలలో విద్యార్థిగా విద్యను అభ్యసిస్తున్న అప్పటి నుంచి తెలుగు విద్యార్థి విభాగం, తెలుగు యువత విభాగాల్లోనూ మన్నవ మోహనకృష్ణ చురుకుగా పనిచేశారు. విద్యాభ్యాసం అనంతరం అమెరికాలో వ్యాపార రంగంలో స్థిరపడిన మోహన్ కృష్ణ అక్కడ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తూ అగ్రరాజ్యంలో ఎన్నో తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగ పటిష్ఠతకు ఎనలేని కృషి చేశారు. అమెరికాలోని జాతీయ తెలుగు సంఘాలలో ఒకటైన నాట్స్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికా జాతీయ తెలుగు సంఘాలకు అధ్యక్షులుగా విధులు నిర్వహించిన వారిలో అందరికంటే పిన్న వయస్కుడు మన్నవ మోహనకృష్ణ. 


బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు అమెరికాలో నిధులు సేకరించడంలో కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్‌గా కొనసాగుతూ మోహన్ కృష్ణ నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణకు ఎంతో ఆప్తుడు అయ్యారు. నాట్స్ అధ్యక్షుడిగా ప్రవాస భారతీయుల కోసం ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తిగా ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాపారపరంగా విదేశాల్లో ఉన్నప్పటికీ తన స్వస్థలం గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు నిత్యం కృషి చేస్తున్నారు. 2019లో టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మన్నవ మోహన్ కృష్ణ పేరు ముందంజలో ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం సీటు కేటాయించకపోయినా 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు ఎంతో కృషి చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మన్నవ పోరాడుతున్నారు. రాష్ట్ర టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మన్నవ సేవలకు గుర్తింపుగా పార్టీ అధిష్టానం కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


మన్నవ మోహన్ కృష్ణ నియామకం పట్ల పార్టీ శ్రేణుల హర్షం

స్వదేశంలోనూ, విదేశాల్లోనూ టీడీపీ పటిష్టతకు అహర్నిశలు పాటుపడుతున్న మన్నవ మోహనకృష్ణకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు మన్నవ మోహన కృష్ణను ఘనంగా సత్కరించాయి. మోహన కృష్ణ మాట్లాడుతూ పదవులతో నిమిత్తం లేకుండా టీడీపీని తిరిగి అధికారంలోకి తేవడమే తన ధ్యేయమన్నారు. తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను పార్టీ శ్రేణుల సహకారంతో సమర్ధవంతంగా నిర్వహిస్తూ టీడీపీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్‌కు మన్నవ మోహన కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2021-10-17T15:50:58+05:30 IST