ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు జగన్ పతనానికి నాంది: మన్నవ సుబ్బారావు

ABN , First Publish Date - 2022-09-25T02:53:19+05:30 IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు ప్రవాసీయులు ముక్తకంఠంతో ఖండించారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు జగన్ పతనానికి నాంది: మన్నవ సుబ్బారావు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు ప్రవాసీయులు ముక్తకంఠంతో ఖండించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారందరూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రుల ఆరాధ్య నటుడు, ప్రజా నాయకుడు.. తెలుగు వారి ‘అన్న’ ఎన్టీఆర్ పేరిట ఉన్న యూనివర్శిటీ పేరు మార్పుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ కార్యక్రమానికి భాను మాగులూరి అధ్యక్షత వహించారు. 


ఈ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. జగన్‌కు పేర్లు, రంగుల పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. ‘‘పిచ్చి ముదరడంతో ఏది కనిపిస్తే దానికి పార్టీ రంగులు పూయడం లేదా తన పేరో, తన తండ్రి పేరో పెడుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం ఓ చారిత్రక తప్పిదం. జగన్ మెడకు ఇది ఉరితాడు అవుతుంది. వైద్య విద్యకు ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలి, వైద్య విద్య ప్రమాణాలు పెంచాలనే ఉన్నతమైన ఆలోచనలతో 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ దీన్ని ప్రారంభించారు. కానీ ఎన్టీఆర్ తన పేరు పెట్టుకోలేదు. ఆయన మరణానంతరం ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇప్పటికే జగన్ రెడ్డి అనేక ప్రభుత్వ పథకాలకు తన సొంత పేర్లు పెట్టుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సుమారు 90 పథకాలకు పేర్లు మార్చి తన తండ్రి పేరు, తన పేరు పెట్టుకొని జబ్బలు చరుచుకుంటున్నారు. ఏదైనా కొన్ని కొత్త ప్రాజెక్టులు నిర్మించి... లేదా ఇంకా గొప్ప పథకాలు రూపొందించి తన తండ్రి పేరు, తన పేరు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా వున్న పేర్లు తొలగించి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్ పేరు పెట్టడం ముమ్మాటికీ సమంజసం కాదు’’ అని స్పష్టం చేశారు.  


భాను మాగులూరి మాట్లాడుతూ, ఇది దివంగత నేత వైఎస్సార్‌కి కూడా గౌరవం తెచ్చిపెట్టే అంశం ఏమాత్రం కాదని స్పష్టం చేశారు. ‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికార మార్పిడితో పాటు పేర్లు కూడా పూర్తిగా మారిపోతాయా? ఇలాగే గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును తొలగించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇలానే అలోచించి ఉంటే వైఎస్సార్ జ్ఞాపకాలు ఏమి మిగిలేవి కావు.  ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుతున్న వేళ ప్రభుత్వం నిర్ణయం తెలుగువారందరినీ అవమానపరిచే విధంగా వుంది. పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ చరిత్రను, కోట్లాదిమంది ప్రజల హృదయాలలో వున్న అభిమానాన్ని చెరిపి వేయలేరు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి.... తెలుగువారి శాశ్వత గుండె చప్పుడుగా మిగిలిపోయారు’’ అని తెలిపారు.


ఇలాంటి సామాజిక ఉద్యమ నిర్మాత పేరు మార్చి జగన్ రెడ్డి చరిత్ర హీనుడుగా మిగిలిపోయారని ధూళిపాళ్ల వీరనారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేకమంది పెద్దలు, యువకులు మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతాలకతీతంగా అన్న ఎన్టీఆర్ సమాజ సేవ చేశారని, అలాంటి వారి పేరిట ఉన్న యూనివర్శిటీ పేరు మార్చటం ముమ్మాటికీ సబబు కాదని అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలు కూడా దీన్ని ఏమాత్రం అంగీకరించరని, దీనిని ఉపసంహరించుకోకపోతే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. అంతేకాకుండా..  ప్రజా న్యాయస్థానంలో దోషిగా నిలబడి మరోసారి చీవాట్లు తినక తప్పదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీతారామారావు, పురుషోత్తమరావు, బసవరావు, సిద్దార్ధ్, నాగశంకర్, వినీల్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T02:53:19+05:30 IST