వైభవంగా నృసింహుడి కల్యాణం
ABN , First Publish Date - 2022-05-16T05:38:11+05:30 IST
గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వేద పండితులు ఆదివారం వైభవంగా నిర్వహించారు.
గుర్రంకొండ, మే 15: గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వేద పండితులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి నెల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయాన్నే స్వామి వారిని మేల్కొలిపి ఆలయశుద్ధి, తోమాలసేవ, అర్చన, పంచామృతాలతో అభిషేకాలు చేసి అనంతరం శ్రీదేవి, భూదేవిలతో స్వామి వారి కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు గోపాల్భట్టార్, కృష్ణప్రసాద్, కృష్ణరాజ్, అనిల్, గోకుల్, సుందరరాజు, వెంకీ, వరద, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
మదనపల్లె అర్బన్లో: చిన్నతిప్పసముద్రం పంచాయతీలో ఉన్న లక్ష్మీనరసంహస్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం నరసింహస్వామికి శయనోత్సవం నిర్వహిం చారు. అంతకుముందే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.