పెగాసస్ వల్ల లక్షలాది మంది హాయిగా నిద్రపోతున్నారు : ఎన్ఎస్ఓ

ABN , First Publish Date - 2021-07-24T21:17:22+05:30 IST

ఇజ్రాయెలీ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూపు తన పెగాసస్

పెగాసస్ వల్ల లక్షలాది మంది హాయిగా నిద్రపోతున్నారు : ఎన్ఎస్ఓ

న్యూఢిల్లీ : ఇజ్రాయెలీ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూపు తన పెగాసస్ స్పైవేర్‌ను సమర్థించుకుంది. ఇటువంటి టెక్నాలజీలు నిఘా, దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండటం వల్ల లక్షలాది మంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రపోగలుగుతున్నారని, వీథుల్లో సురక్షితంగా సంచరించగలుగుతున్నారని చెప్పింది. ఈ టెక్నాలజీని తాను ఆపరేట్ చేయనని, తన క్లయింట్లు సేకరించిన సమాచారం తనకు చేరబోదని వివరించింది. 


పాత్రికేయులు, మానవ హక్కుల మద్దతుదారులు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. అనేక దేశాల ప్రభుత్వాలు ఈ కంపెనీ నుంచి ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేశాయని ఓ ఇంటర్నేషనల్ మీడియా కన్సార్షియం బయటపెట్టింది. 


ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఓ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, పెగాసస్‌తోపాటు ఇటువంటి టెక్నాలజీల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రపోగలుగుతున్నారని, వీథుల్లో సురక్షితంగా సంచరించగలుగుతున్నారని చెప్పారు. నేరగాళ్ళు, ఉగ్రవాదులు, బాలలపై లైంగిక నేరగాళ్ళు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ యాప్‌ల గొడుగు క్రింద దాక్కుంటున్నారని, ఇటువంటివారిని నిరోధించేందుకు, వారిపై దర్యాప్తు చేసేందుకు పెగాసస్ వంటి టెక్నాలజీలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. 


సైబర్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను ప్రపంచంలోని చాలా సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో కలిసి ప్రభుత్వాలకు ఎన్ఎస్ఓ సమకూర్చుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సమాచారం అందని స్థితిలో ఉన్నాయన్నారు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో దురుద్దేశపూరితమైన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు లా ఎన్‌పోర్స్‌మెంట్ ఏజెన్సీలకు రెగ్యులేటరీ పరిష్కారం లేదన్నారు. 


పెగాసస్ స్పైవేర్‌పై చెలరేగిన దుమారం గురించి ప్రస్తావిస్తూ, ఈ టెక్నాలజీని ఎన్ఎస్ఓ ఆపరేట్ చేయదన్నారు. దీని ద్వారా సేకరించిన సమాచారం తమకు తెలియదని చెప్పారు. సురక్షిత ప్రపంచాన్ని సృష్టించేందుకు దోహదపడటానికి తాము అత్యుత్తమంగా కృషి చేస్తున్నామని చెప్పారు. 


ఇదిలావుండగా ఎన్ఎస్ఓ గ్రూపు  తయారు చేసిన నిఘా సాఫ్ట్‌వేర్ దుర్వినియోగమవుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. 


Updated Date - 2021-07-24T21:17:22+05:30 IST