రైలుకు నిప్పుపెట్టిన రైల్వే బోర్డు ఉద్యోగ అభ్యర్థులు

ABN , First Publish Date - 2022-01-26T20:38:38+05:30 IST

బీహార్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు చేపట్టిన నిరసనలు..

రైలుకు నిప్పుపెట్టిన రైల్వే బోర్డు ఉద్యోగ అభ్యర్థులు

పాట్నా: బీహార్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు చేపట్టిన నిరసనలు ఆందోళనకరంగా మారాయి. బోర్డు పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు హింసాత్మక చర్యలకు దిగారు. రైల్వే శాఖ తీరును తప్పుపడుతూ గయలో ఓ ప్యాసింజర్ రైలు బోగీకి బుధవారంనాడు నిప్పుపెట్టారు. మంటల్లో బోగీల్లోని సీట్లు, బెర్తులు పూర్తిగా కాలి బూడిదయ్యారు. ఆర్ఆ‌ర్‌బీ-ఎన్‌టీపీపీసీ ఫలితాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు సీతామర్షి రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. పాట్నాలోని పలు ప్రాంత్రాల్లోనూ అభ్యర్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు.


కాగా, గయలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని గయ ఎస్ఎస్‌పీ ఆదిత్య కుమార్ తెలిపారు. నిరసనకారులు ఒక రైలుకు నిప్పుపెట్టారని, వీరిలో పలువురిని గుర్తించామని చెప్పారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, విద్యార్థులు ఎవరి ప్రభావానికి లోనుకావద్దని, ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయవద్దని సూచించారు. మరోవైపు విద్యార్థులు ఆందోళనకు దిగడంపై రైల్వే శాఖ మండిపడింది. ఎన్‌టీపీసీ, లెవెల్-1 పరీక్షలను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు  రైల్వే శాఖ ప్రకటించింది. వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులలో (ఆర్ఆర్‌బీ) ప్యాసయిన, ఫెయిలైన విద్యార్థుల సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇరువర్గాల వాదనలు విని కమిటీ ఒక నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుందని పేర్కొంది. విధ్వంసకాడంలో ప్రమేయమున్నట్టు గుర్తించిన విద్యార్థులకు రైల్వేలో ఉద్యోగం ఇవ్వమని తేల్చిచెప్పింది. రైల్వే ఆస్తుల విధ్వంసం, నిప్పుపెట్టడం వంటి ఘటనలకు పాల్పడితే జీవితాంతం రైల్వేశాఖలో ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపింది. కాగా, పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటున్న విద్యార్థులు వారిని వెంటనే సరిచేయాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-26T20:38:38+05:30 IST