వందేళ్ల పండగ
ABN , First Publish Date - 2022-05-29T06:53:26+05:30 IST
మళ్లీ పుట్టాలయ్యా.. మా రామయ్యా.. మా కృష్ణయ్యా.. మా అన్నయ్యా అంటూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను శనివారం ఊరూవాడా ఘనంగా నిర్వహించారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
నల్లజర్ల/ రాజమహేంద్రవరం, మే 28 : మళ్లీ పుట్టాలయ్యా.. మా రామయ్యా.. మా కృష్ణయ్యా.. మా అన్నయ్యా అంటూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను శనివారం ఊరూవాడా ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు.. అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ పాటలు పెట్టి అలరించారు. అభిమానులు స్టెప్పులు వేశారు.. ఇలా అందరూ చేసినట్టు ఎన్టీఆర్ శతజయంతిని చేస్తే ఆశ్చర్యం ఏముంటుంది.. ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించారు నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన టీడీపీ యువత.. అనుకున్నదే తడవుగా 6 అడుగులు పొడవు.. 4 అడుగుల వెడల్పుతో ఒక కేక్ తయారు చేయించారు. ఆ కేక్ బరువెంతో తెలుసా.. అచ్చంగా 100 కేజీలు.. ఎన్టీఆర్ ప్రతిమతో కూడిన కేక్ను శనివారం రాత్రి గ్రామంలో అభిమానులు, కార్యకర్తల మధ్య మాజీ సొసైటీ అధ్యక్షుడు కొఠారి వెంకటేశ్వరరావు, మందా శ్రీనివాసరావు, కె. ప్రభాకరరావు కట్ చేశారు. అనంతరం ఊరంతా పంచి మరో వందేళ్లయినా మా మదిలో ఉంటావయ్యా అంటూ ఎన్టీఆర్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.. ఇక రాజమహేంద్రవరంలో గన్ని కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. జై ఎన్టీఆర్.. జైజై ఎన్టీఆర్ అంటూ పురవీధుల గుండా బైక్లపై ర్యాలీ సాగింది. పెద్ద నాయకులంతా ఒంగోలులో జరుగుతున్న మహానాడులో ఉన్నా ఎన్టీఆర్ జయంతి మాత్రం ఎక్కడా ఆగలేదు.. విగ్రహాలను శుభ్రం చేసి శనివారం ఉదయం నుంచి పండుగలా చేశారు.