తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్టు సేవలు విస్తృతం
ABN , First Publish Date - 2022-05-22T06:29:59+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్టు సేవలు విస్తృతం
తెలంగాణ, ఆంధ్రల్లో మూడుచోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు
గూడూరు రూరల్, మే 21: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్టు సేవలు విస్తృతం చేస్తున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గూడూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని నర్సింహులు, మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ భూక్య వెంకట్రాములు సంయుక్తంగా శనివారం ప్రారంభించారు. అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో డిజిటల్ స్ర్కీన్ను చేయగా చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశమందించారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గూడూరు ఏజెన్సీలో గిరిజనులకు ఈ ప్లాంట్ ద్వారా ఉచితంగా ఆక్సిజన్ అందించనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కొవిడ్తో ఆక్సిజన్ అందక మృతి చెందారని చెప్పారు. జూమ్ యాప్ ద్వారా వీడియోలింక్ను షేర్ చేసి లక్షలాది మంది కొవిడ్ బాధితులకు టెలీ మెడిసిన్ సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు, తెలుగుదేశం పార్టీ సమన్వయంతో ఈ టెలీమెడిసిన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో కుప్పం, టెక్కలి, గూడూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అదనపు కలెక్టర్ అభిలాషఅభినవ్ మాట్లాడుతూ.. గూడూరు ఏజెన్సీ ప్రాంతంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు ప్రతినిధి రాజీవ్రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి పుల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి రాజునాయక్, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండపల్లి రాంచందర్రావు, మహబూబాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ సునిత, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి మహే్షనాయక్, ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ భరత్రెడ్డి, మండలాల అధ్యక్షులు నాయిని నరేందర్, వెంకన్న పాల్గొన్నారు.