‘మోసం చేశాడు.. నా ప్రియుడితో పెళ్లి జరిపించండి’

ABN , First Publish Date - 2021-03-09T13:56:16+05:30 IST

కరోనా టీకా పేరుతో దాదాపు నెల రోజుల క్రితం వృద్ధ దంపతులను మోసం చేసింది ఓ నర్సు.

‘మోసం చేశాడు.. నా ప్రియుడితో పెళ్లి జరిపించండి’

హైదరాబాద్/సరూర్‌నగర్‌ : కరోనా టీకా పేరుతో దాదాపు నెల రోజుల క్రితం వృద్ధ దంపతులను మోసం చేసింది ఓ నర్సు. అయితే, ఇప్పుడు ఆ నర్సును ప్రేమ పేరుతో మోసం చేశాడో యువకుడు. ప్రేమ, పెళ్లి పేరుతో తనకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసి తన ప్రియుడు ముఖం చాటేశాడని ఆ నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వికారాబాద్‌కు చెందిన యువతి (21) కొన్నాళ్ల పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సుగా పని చేసింది. ఆమెకు ఏడాది క్రితం దేవరకొండకు చెందిన విజయ్‌(25)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భార్యాభర్తలుగా చెప్పుకుని ఇద్దరూ కలిసి కొన్నాళ్లు జిల్లెలగూడలోని లలితానగర్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ఆ యువతి లలితానగర్‌లోని ఓ వృద్ధ దంపతులకు కరోనా టీకా పేరుతో మత్తు మందిచ్చి, వారి నగలు తస్కరించగా వెంటనే రంగంలోకి దిగిన మీర్‌పేట్‌ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. ఆ సమయంలోనే విజయ్‌ జిల్లెలగూడ నుంచి వెళ్లి పోయాడు.


ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె విజయ్‌ను పెళ్లి చేసుకోవాలని అడిగింది. అయితే, తనను పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పుకోవడంలేదని, కనీసం తనను కలవడానికి రావడం లేదని, ఫోన్‌ కూడా చేయడంలేదని బాధిత యువతి మీర్‌ పేట పోలీసులకు తెలిపింది. ఆ యువకుడితో గతంలో తీసుకున్న పలు ఫొటోలను పోలీసులకు అందజేసింది. ఆమె ఫిర్యాదు మేరకు తాము సోమవారం విజయ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను పీఎస్‌కు పిలిపించామని పోలీసులు చెప్పారు. యువకుడు పెళ్లికి ఒప్పుకోకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీర్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి చెప్పారు.

Updated Date - 2021-03-09T13:56:16+05:30 IST