AIADMK : పన్నీర్‌సెల్వంకు మద్రాస్ హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2022-08-17T19:53:36+05:30 IST

ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగమ్ (AIADMK) జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని

AIADMK : పన్నీర్‌సెల్వంకు మద్రాస్ హైకోర్టులో ఊరట

చెన్నై : ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగమ్ (AIADMK) జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని మళ్లీ నిర్వహించాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) బుధవారం రూలింగ్ ఇచ్చింది. జూన్ 23నాటికి ఉన్న స్థితి యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. జస్టిస్ జీ జయచంద్రన్ ఈ రూలింగ్ ఇచ్చారు. దీంతో ఆ పార్టీ నేత ఓ పన్నీర్‌సెల్వం (O Panneerselvam-ఓపీఎస్)కు గొప్ప ఊరట లభించింది. 


ఏఐఏడీఎంకేలో జూన్ 23నాటికి ఉన్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ సమ్మతి లేకుండా జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించరాదని చెప్పింది. 


ఈ పిటిషన్‌పై మొదట జస్టిస్ కృష్ణన్ రామసామి విచారణ జరిపారు. ఓపీఎస్ తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు జస్టిస్ జీ జయచంద్రన్ బెంచ్‌కి బదిలీ చేశారు. 


జూలై 11న నిర్వహించిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ చెల్లదని ఓపీఎస్ తరపు న్యాయవాది వాదించారు. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేసినట్లయితే, ద్వంద్వ నాయకత్వం నియమించిన జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏ విధంగా తమ పదవుల్లో కొనసాగుతారని ప్రశ్నించారు. జూన్ 23న ప్రిసీడియం చైర్మన్‌కు సంబంధించిన తీర్మానం చేయడానికి ముందే ఓపీఎస్ ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారని తెలిపారు. బైలాస్ ప్రకారం సమావేశం నిర్వహణకు కోఆర్డినేటర్ సమ్మతి అవసరమని పేర్కొన్నారు. 


ఈ వాదనలను ఎడపాడి పళనిస్వామి (EPS) తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. తాత్కాలిక జనరల్ సెక్రటరీగా ఈపీఎస్‌కు 2,500 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేశారని తెలిపారు. నాలుగు నెలల్లోగా ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. 


Updated Date - 2022-08-17T19:53:36+05:30 IST