యవ్వనంలో ఎన్నో గిత్తల్ని లొంగదీశా...

ABN , First Publish Date - 2022-04-29T12:36:08+05:30 IST

యుక్తవయసులో తాను ఎన్నో జల్లికట్టు ఎద్దులను లొంగదీసుకున్నానని అన్నాడీఎంకే సమన్వయకర్త, ప్రతిపక్ష ఉపనేత ఒ.పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. శాసనసభ

యవ్వనంలో ఎన్నో గిత్తల్ని లొంగదీశా...

పెరంబూర్‌(చెన్నై): యుక్తవయసులో తాను ఎన్నో జల్లికట్టు ఎద్దులను లొంగదీసుకున్నానని అన్నాడీఎంకే సమన్వయకర్త, ప్రతిపక్ష ఉపనేత ఒ.పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో గురువారం ప్రశ్నోత్తరాల అనంతరం జరిగిన చర్చలో.. జల్లికట్టుపై ఎవరి ప్రభుత్వ హయాంలో నిషేధం విధించారు? ఎవరి హయాంలో నిషేధం తొలగించారన్న ప్రస్తావన వచ్చింది. ఒ.పన్నీర్‌సెల్వంను అన్నాడీఎంకే నేతలు ‘జల్లికట్టు నాయకుడు’ అంటూ సంభోధిస్తున్నారని, ఆయన ఎన్ని పోటీల్లో పాల్గొని ఎద్దుల్ని లొంగదీశారో ఎవ్వరికీ తెలియదని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి మెయ్యనాథన్‌ ఎద్దేవా చేశారు. పెరియకుళంలో నిర్వహించే పోటీల్లో తాను యవ్వనంలో వున్నప్పుడు ఎన్నో గిత్తల్ని లొంగదీశానని పన్నీర్‌సెల్వం  తెలిపారు. డీఎంకే-కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎద్దులను జంతువుల జాబితాలో చేర్చడంతో జల్లికట్టు పోటీలు నిర్వహించలేదని, అన్నాడీఎంకే ప్రభుత్వం జల్లికట్టు పోటీల నిర్వహణపై అసెంబ్లీలో తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం పొంది ‘జల్‌ జల్‌ జల్‌’ అంటూ రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు నిర్వహించిందని  తెలిపారు. అంతలో కాంగ్రెస్‌ శాసనసభ పక్షనేత సెల్వపెరుందగై జోక్యం చేసుకుంటూ.. డీఎంకే-కాంగ్రెస్‌ ప్రభుత్వం జల్లికట్టు పోటీలను నిషేధించలేదని, పెటా, బ్లూక్రాస్‌ సంస్థ వేసిన పిటిషన్లతో సుప్రీంకోర్టు నిషేధం విధించిందని వివరించారు. అన్నాడీఎంకే జల్లికట్టుకు అనుమతివ్వలేదని, ప్రజలు పోరాడి సాధించుకున్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-29T12:36:08+05:30 IST