OPS: సర్వసభ్యమండలి వివాదంపై సుప్రీంకోర్టులో ఓపీఎస్ అప్పీలు
ABN , First Publish Date - 2022-09-06T13:04:08+05:30 IST
అన్నాడీఎంకే శాసనసభాపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) అధ్యక్షతన జూలై 11న జరిగిన ఆ పార్టీ సర్వసభ్యమండలి సమావేశం
చెన్నై, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే శాసనసభాపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) అధ్యక్షతన జూలై 11న జరిగిన ఆ పార్టీ సర్వసభ్యమండలి సమావేశం న్యాయసమ్మతమేనంటూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్సెల్వం (O. Panneerselvam) సోమవారం సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. గత కొద్ది రోజులుగా హైకోర్టు ధర్మాసనం తీర్పుపై అప్పీలుకు వెళ్లేదిశగా ఓపీఎస్ తన నివాసంలో తన మద్దతుదారులు, న్యాయనిపుణులతో సమగ్రంగా చర్చలు జరిపారు. ఆ మేరకు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఓపీఎస్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు. ఈ అప్పీలుపై త్వరలో విచారణ జరుగుతుందని ఓపీఎస్ తరఫు సీనియర్ న్యాయవాది(Senior Advocate) ఒకరు తెలిపారు. ఇక ఓపీఎస్ అప్పీలు చేయకముందే గత శుక్రవారం ఈపీఎస్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో కెవియట్ దాఖలు చేశారు. అప్పీలుపై విచారణ జరిగే సమయంలో తమ తరపు వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆ కెవియట్లో కోరారు.