Panneerselvam: సర్వసభ్య మండలికి సిద్ధమవుతున్న ఓపీఎస్
ABN , First Publish Date - 2022-08-20T15:17:05+05:30 IST
అన్నాడీఎంకేలో జంట నాయకత్వమే కొనసాగించాలంటూ హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రన్ జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఆ పార్టీ సమన్వయకర్త
- ఇప్పటికైనా కలసి సాగుదామంటూ ఈపీఎస్కు రాయబారం!
- ససేమిరా అన్న పళనిస్వామి!
చెన్నై, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో జంట నాయకత్వమే కొనసాగించాలంటూ హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రన్ జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్సెల్వం(O. Panneerselvam) త్వరలో సర్వసభ్యమండలిని నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం మునుపటిలా కలిసి పనిచేయడానికి రమ్మంటూ ఓపీఎస్ ఇచ్చిన పిలుపును పార్టీ శాసనసభాపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈపీఎస్ ప్రస్తుతం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీలుపై తనకు సానుకూలమైన తీర్పు వెలువడుతుందనే ఆశాభావంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఓపీఎ్సతో కలిసి పార్టీని సమర్థవంతంగా నిర్వహించేందుకు రమ్మంటూ ఆయన వర్గానికి చెందిన వైద్యలింగం, ఈపీఎస్ వర్గానికి చెందిన మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, తంగమణి(Former Ministers SP Velumani and Thangamani)తో రహస్యంగా మంతనాలు కూడా జరిపారు. పాత సంగతులను మరచి పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు ఈపీఎస్ ముందుకు రావాలని వైద్యలింగం సూచించారు. ఈ చర్చల సారాంశాన్ని ఎస్పీ వేలుమణి ఈపీఎస్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపీఎస్తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ఓపీఎస్ తనయుడైన ఎంపీ రవీంద్రనాథ్(MP Rabindranath) ఈపీఎస్కు మూడు సార్లు ఫోన్ చేసి మునుపటిలా పార్టీ బాధ్యతలు స్వీకరించాలని ఆహ్వానించినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కోర్టు తీర్పు నేపథ్యంలో ఈపీఎస్ వర్గంలోని సర్వసభ్యమండలి సభ్యులంతా తన వైపునకు వస్తారని ఓపీఎస్(OPS) ఎదురు చూస్తున్నారు. పార్టీ సమన్వయకర్తగా పార్టీలో తనకే సర్వాధికారాలు ఉన్నాయని, పార్టీ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని తన వర్గంలో చేరాలంటూ సర్వసభ్యమండలి సభ్యులను ఆయన ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓపీఎస్ తన స్వస్థలమైన పెరియకుళంలో బసచేస్తూ పలువురు పార్టీ జిల్లా శాఖ నాయకులతో రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. అదే సమయంలో సమన్వయకర్త హోదాలో జిల్లాల వారీగా స్థానిక శాఖ నాయకులను కూడా నియమించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జిల్లా శాఖ నాయకుల నుంచి కొత్త పదవుల కోసం ప్రయత్నిస్తున్న ఆశావహుల జాబితాను కూడా సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత సర్వసభ్యమండలి సమావేశం నిర్వహించేలా సభ్యులందరికీ త్వరలో ఆహ్వాన పత్రాలను పంపాలని ఓపీఎస్ భావిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నెలలోగా సర్వసభ్యమండలి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. అదే సమయంలో ఆ సమావేశం నిర్వహణకు కోర్టు తరఫున కమిషనర్ను నియమించాలని న్యాయమూర్తి జయచంద్రన్కు వినతి పత్రం కూడా సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే తీర్పు వెలువడి మూడు రోజులు కావటంతో మూడు వారాల్లోపున సర్వసభ్యమండలి సమావేశాన్ని జరిపేందుకు ఓపీఎస్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.