ఆక్రమణలు
ABN , First Publish Date - 2021-11-29T06:51:08+05:30 IST
మండల కేంద్రంలో ఆక్రమణలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. మురికి కాలువలను ఆను కుని ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా వ్యాపార వర్గాల వారు రోడ్లను ఆక్రమించుకుని తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
బోథ్లో రోజురోజుకూ పెరిగిపోతున్న ఆక్రమణలు
మురికి కాలువలకు ఆనుకొని ఇళ్ల నిర్మాణం
రోడ్లును ఆక్రమిస్తున్న వ్యాపారులు
భారీ వాహనాలతో ట్రాఫిక్జాం
ఇబ్బందులకు గురవుతున్న పట్టణ వాసులు
బోథ్, నవంబరు 28: మండల కేంద్రంలో ఆక్రమణలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. మురికి కాలువలను ఆను కుని ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా వ్యాపార వర్గాల వారు రోడ్లను ఆక్రమించుకుని తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
పాలకులు మారినప్పుడల్లా..
బోథ్ గ్రామ పంచాయతీలో పాలకులు మారినప్పుడల్లా ఆక్రమణల జోరు పెరిగి పోతు న్నాయని స్థానికులు వాపోతున్నారు. నాయకుల అనుచరగణం ఆక్రమణలకు పాల్పడుతుంటే వారికి నాయకులు వత్తాసు పలుకుతున్నారు. బోథ్లో ఓ పార్టీ నాయకుడు, ప్రజాప్రతినిధి భర్త మురికి కాలువపై వ్యాపార సముదాయాన్ని నిర్మించడం విమర్శ లకు తావిస్తోంది. ఆయనను వారించాల్సిన పంచాయతీ వారు చూస్తూ ఊరుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాస్థాయి అధికారులు డీఎల్పీవో ఇటీవల బోథ్కు వచ్చిన సమయంలో ఆక్రమణల పై చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఈవోను ఆదేశించినా చర్యలు శూన్యం. ఇక బస్టాండ్ ముందున్న రోడ్లపై హో టళ్లను ఏర్పాటు చేసినా అడిగే నాథుడే కరువయ్యాడని గ్రామస్థులు వాపోతున్నారు.
మెయిన్ రోడ్డుపై కూడా...
బోథ్లోనికి వెళ్లే మెయిన్ రోడ్డును ఆక్రమించుకుని బడా వ్యాపారులు రోడ్లపైన విక్రయ సామగ్రిని ఉంచడంతో రోడ్డు ఇరుకుగా మారుతోంది. బస్టాండ్ నుంచి మర్లపెల్లి రోడ్డు వరకు రోడ్డంతా ఆక్రమణలతో నిండింది. దీంతో వాహనాలు నిలిచి ట్రాఫిక్జాం అవుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం
: అంజయ్య, ఈవో, బోథ్
బోథ్ పట్టణంలో రోడ్లపై వ్యాపారాలు చేసుకునే వారికి ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తాం. అదేవిఽధంగా రోడ్లను ఆక్రమించుకున్న వారికి నోటీసులు జారీ చేస్తాం. ఇక మురికి కాలువలపై నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు చేపడతాం.